AP

ఏపీ సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసు.. ఎందుకంటే..?

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తరచూ అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం నోటీసు జారీ చేసింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఏప్రిల్ 5న జగన్ రెడ్డిపై అధికారికంగా ఫిర్యాదు చేస్తూ ఈసీకి లేఖ రాశారు.

 

వైఎస్‌ఆర్‌సిపి ‘మేమంత సిద్ధం’ సమావేశంలో చేసిన దురుద్దేశపూరిత వ్యాఖ్యలపై 48 గంటల్లోగా తన స్టాండ్‌ను సమర్పించాలని జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసు పంపింది. లేని పక్షంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై తదుపరి చర్య కోసం సీఈసీకి నివేదిక పంపిస్తారు.

ఏప్రిల్ 2, 3, 4 వ తేదీల్లో మదనపల్లె, పూతల పట్టు, నాయుడుపేటలో మేమంతా సిద్ధం సభలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ పలు అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు హంతకుడు అని, ఆయనకు ప్రజలను మోసం చేయడం అలవాటని, శాడిస్ట్ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు చంద్రముఖి సినిమాలో పశుపతిలా తిరిగి వచ్చారంటూ పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారని వర్ల తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

చంద్రబాబుపై దురుద్దేశ పూర్వకంగా సీఎం వ్యాఖ్యలు చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని, గీత దాటిన సీఎం జగన్పై వేటు వేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య ఎన్నికల కమిషనర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. సీఎం వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లనూ జత చేశారు. వీటిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. సీఎం జగన్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని ప్రాథమికంగా తేల్చారు.

 

తాను చేసిన వ్యాఖ్యలపై నోటీసు అందిన 48 గంటల్లో తమకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలన్నారు. నిర్దిష్ట గడువులోగా వివరణ రాకపోతే చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.