AP

ఏపీలో సచివాలయాలు రద్దవుతాయా..?

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలను లబ్దిదారులకు మెరుగ్గా అందిస్తామంటూ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. దాదాపు లక్షన్నర మంది ఉద్యోగుల్ని కూడా ఇందులో వివిధ విభాగాల కార్యదర్శులుగా నియమించింది. అయితే ఇంత పెద్ద వ్యవస్థ ఉండి కూడా ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం జరగడం లేదని భావిస్తున్న కూటమి సర్కార్ ఇందులో ఉద్యోగుల హేతుబద్ధీకరణకు నిర్ణయం తీసుకుంది. అయితే ఉద్యోగుల నుంచి దీనిపై వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది.

 

రాష్ట్రంలో ప్రస్తుతం 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో ఒక్కో సచివాలయంలో దాదాపు 12 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. అయితే వీరి వల్ల అనుకున్న స్ధాయిలో ప్రభుత్వ సేవలు లబ్దిదారులకు అందడం లేదని భావిస్తున్న కూటమి ప్రభుత్వం వీరిని మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్సనరీస్ గా విభజించేందుకు నిర్ణయించింది. వీరితో పాటు మరొకరిని ఆస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని సీఎం చంద్రబాబు తాజాగా ఆదేశించారు.

 

అయితే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చర్చించి మార్పుల గురించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జానీ బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు తాజాగా కోరారు. వ్యవస్థలో మార్పుల వలన ఉద్యోగులకు వ్యవస్థకు మేలు చేకూర్చే నిర్ణయాలు జరగాలంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చర్చించడమే సరైన విధానం అన్నారు. అలాగే ఇంత పెద్ద వ్యవస్థపై నిర్ణయం తీసుకునే ముందు

కేబినెట్, ఉన్నతాధికారులు సుదీర్ఘ అనుభవం, శాశ్వత సభ్యత్వం కలిగిన ఉద్యోగసంఘాలతో చర్చించాలన్నారు.

 

దీంతో ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. అయితే ప్రస్తుతం సచివాలయాల్లో పనిచేస్తున్న లక్షా 30 వేల మంది ఉద్యోగుల రేషనలైజేషన్ సాధ్యం కాకపోతే మాత్రం మొత్తంగా ఈ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వంలో కలిపేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలూ లేకపోలేదు. మరోవైపు ఈ వ్యవస్థ రద్దయితే మాత్రం వార్డు సచివాలయాల్లో కార్యదర్శులు మున్సిపల్ శాఖకూ, గ్రామ సచివాలయాల్లో సిబ్బంది కాస్తా పంచాయతీ రాజ్ శాఖకూ మారిపోవడం ఖాయం.