AP

ఆ ఛానెళ్లపై కేసు నమోదు.. లైసెన్స్ లను రద్దు చేయాలని టీటీడీ ఫిర్యాదు..

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తొలిసారి తన పవర్ చూపించారు. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా ఎవరు ప్రవర్తించినా చర్యలు తీసుకుంటామని పలుమార్లు చైర్మన్ హెచ్చరించారు. కానీ కొందరు అదే రీతిలో ప్రవర్తిస్తున్నట్లు గుర్తించిన టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. మున్ముందు ఇలాంటి దుష్ప్రచారం ఎవరూ సాగించకుండ ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ఇంతకు అసలేం జరిగిందంటే..

 

ఇటీవల చాగంటి కోటేశ్వరరావు తిరుమలకు వచ్చిన సమయంలో, చాగంటికి అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేశారు. అయితే అదంతా అవాస్తవమని టీటీడీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చాగంటికి ఉన్న కేబినేట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి 14న శ్రీవారి దర్శనం ఏర్పాట్లను టీటీడీ చేసింది. కానీ కొందరు కావాలనే దుష్ప్రచారం చేశారని, ఇటువంటి చర్యలను ఉపేక్షించరాదన్న రీతిలో టీటీడీ సీరియస్ అయింది.

 

తాజాగా తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మూడు యూట్యూబ్ ఛానెళ్ల నిర్వాహకులపై టీటీడీ ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు ఆ మూడు యూట్యూబ్ ఛానెళ్లపై కేసు నమోదు చేశారు. అంతేకాదు టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా వాస్తవాలను వక్రీకరించి దురుద్దేశంతో అవాస్తవాలను ప్రచారం చేసినందుకు పోలీసు కేసుతో పాటు న్యూఢిల్లీలో, విజయవాడ లో గల ప్రెస్ ఇస్పర్మెషన్ బ్యూరో కి కూడ టీటీడీ ఫిర్యాదు చేసింది.

 

అలాగే విష ప్రచారం చేసిన సదరు సోషల్ మీడియా సంస్థల లైసెన్స్ లను రద్దు చేయాలని యూట్యూబ్ మేటా మేనేజ్మెంట్ కి కూడా టీడీడీ ఫిర్యాదు చేయడం విశేషం. ఈ ఫిర్యాదులపై టీటీడీ చైర్మన్ ట్వీట్ చేశారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్ట ఉన్న టీటీడీ సంస్థను పలుచన చేస్తూ ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలను పదే పదే దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులపైనా, సంస్థలపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తం మీద అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై టీటీడీ నిఘా పెట్టిందని చెప్పవచ్చు.