రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు, ఎప్పుడు, ఏ పార్టీ వైపు వెళ్తారో తెలీదు. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది నేతలు ఆచితూచి మాట్లాడుతున్నారు.. ఆపై అడుగులు వేస్తున్నారు. అలాంటి వారిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఒకరు. ఆయన మాటలకు అర్థాలు ఎప్పుడూ వేరుగానే ఉంటాయి. దాని లోతుల్లోకి వెళ్తే తప్ప ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు అదే చేస్తున్నారు.
దువ్వాడ రియాక్ట్ వెనుక
దువ్వాడ శ్రీనివాసరావు.. సరిగ్గా ఐదేన్నరేళ్ల కిందట మీడియా ముందు కంటతడి పెట్టి బాగా పాపులర్ అయ్యారు. అంతేకాదు అచ్చెన్నాయుడ్ని ఏకి పారేశారు. బహుశా అదే ఆయనకు వైసీపీలో పదవి వచ్చేలా చేసిందని ఫ్యాన్స్ పార్టీ నేతలు సమయం వచ్చినప్పుడు చెబుతారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన్ని మండలికి పంపింది. వైసీపీ హయాంలో జాగ్రత్త వ్యవహరించారు. మీడియా ముందుకొచ్చి టీడీపీ నేతలపై ఒంటికాలిపై లేచేశారు.
పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత దువ్వాడ యవ్వారం బయటకు వచ్చింది. ఆయన డబుల్ మేటర్ వ్యవహారం పార్టీని మరింత ఇరకాటంలో పెట్టిందని కొందరు నేతలు ఓపెన్గా చెబుతారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని పెద్దలు చెబుతున్నారు. ఆయన పదవిలో ఉండగానే హైదరాబాద్ వస్త్రాల దుకాణం ఓపెన్ చేశారు.
అప్పుడు మీడియాతో మాట్లాడిన ఆయన, రాజకీయాలు వేరు.. వ్యాపారం వేరని వెల్లడించారు. ఈ వ్యవహారం జరిగి మూడు వారాల తర్వాత దువ్వాడను వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈనెల 22న ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై దువ్వాడ తన మిత్రులతో మాట్లాడి, అప్పుడు ఓ వీడియో రిలీజ్ చేశారు.
మీడియా ముందుకు రాకుండా
వైసీపీ వేటుపై దువ్వాడ శ్రీనివాస్ రియాక్ట్ అయ్యారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన అధినేత జగన్కు ధన్యవాదాలు తెలిపి, చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేశానని, వ్యక్తిగత కారణాల వల్ల సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్తో అడుగులు.. జగన్తో నడుస్తున్న తనకు నా మనసులో అధినేత ఎప్పుడు చిరస్మరణీయడని కొనియాడారు. రాజకీయ క్రీనీడలో తాను బలైయ్యానని మనసులోని మాట బయటపెట్టారు.
పాతికేళ్లగా ప్రజా జీవితంలో ప్రజాసేవనే పరమావధిగా భావించానని, ఏనాడూ పార్టీకి దోహం చేయలేదన్నారు. అధికార దుర్వినియోగం, భూకబ్జాలు, అవినీతి జోలికి వెళ్లలేదన్నారు.‘సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామం’ మాత్రమేనని కొత్త నిర్వచనం చెప్పారు. ఈ సందర్భంగా గురజాడ కొటేషన్ కూడా చెప్పారనుకోండి.. అది వేరే విషయం.
ఇకపై స్వతంత్రుడిగా ప్రజల కోసం, నమ్ముకున్న వారి కోసం నిరంతరం కష్టపడతానన్నది ఆయన వెర్షన్. త్వరలో మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో వస్తానని అన్నారు. అన్నింటికీ కాలమే సమాధానం ఇస్తుందని, ఊపిరి ఉన్నంతవరకు మీ సేవలో ఉంటానన్నారు. అవసరం ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షంగా ఉపయోగపడేందుకు కృషి చేస్తానన్నారు. చివరలో జగన్ కు హృదయ పూర్వక నమస్కారాలు అంటూ ముగించారు.