అమరావతిలో 25 వేల ఉద్యోగాల కల్పనకు తొలిఅడుగు పడింది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రజా రాజధాని అమరావతిలో ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం అన్నారు. ఇంతకు ఆ 25 వేల జాబ్స్ సంగతేమిటో తెలుసుకుందాం.
ఇటీవల ఏపీ ప్రజా రాజధాని అమరావతి పునః నిర్మాణానికి పీఎం మోడీ శంఖుస్థాపన చేసిన విషయం తెలిసిందే. 2027 నాటికి రాజధాని తొలిదశ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ దశలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కాకమునుపే ఎన్నో రికార్డులను సాధించింది. ఇక్కడ నిర్మించే ప్రతి భవనం సింగపూర్ సిటీని తలదన్నేలా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది. అయితే తాజాగా మరో రికార్డును కూడా అమరావతి దక్కించుకుంది. దీనితో ఎందరో యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు దరి చేరనున్నాయి.
అసలు విషయం ఏమిటంటే..
భారతదేశపు తొలి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ ‘క్రియేటర్ల్యాండ్’ అమరావతిలో ఏర్పాటు కానుంది. భారత్లో మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన ‘క్రియేటర్ల్యాండ్’ ఏర్పాటుకు గోప్ క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందాన్ని గోప్ సంస్థ కుదుర్చుకుంది. ఈ ప్రకటనతో అమరావతిలో సృజనాత్మకతకు నూతన అధ్యాయం ప్రారంభం కానుంది.
25,000 ఉద్యోగాల లక్ష్యం..
ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా 25 వేల ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్న గోప్ సంస్థ, రాష్ట్రానికి భారీ ఎఫ్డీఐను తీసుకురావడమే కాక, స్థానిక ప్రతిభకు ప్రపంచస్థాయి అవకాశాలను కల్పించేందుకు సిద్ధంగా ఉంది. క్రియేటర్ల్యాండ్ అనేది చలనచిత్రం, గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, ఇమ్మర్సివ్ స్టోరిటెల్లింగ్, AI ఆధారిత కంటెంట్ వంటి విభాగాలకు కేంద్రంగా రూపొందించబడుతోంది. క్రియేటర్ల్యాండ్ అకాడమీ ద్వారా యువతకు నైపుణ్యం కల్పించేందుకు వినూత్న విధానాన్ని తీసుకొస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సృజనాత్మక డిజిటల్ రంగాల్లో గ్లోబల్ హబ్గా ఎదగనుందని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అంతర్జాతీయ వేదికకు ఏపీ యువత నైపుణ్యతను అందించాలన్న లక్ష్యం నెరవేరుతుందని చెప్పవచ్చు.
సీఎం చంద్రబాబు ట్వీట్..
ప్రజా రాజధాని అమరావతిలో భారతదేశం యొక్క మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ల్యాండ్ను ప్రారంభించడానికి గోప్ క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉందని సీఎం ట్వీట్ చేశారు. అమరావతి రాజధాని ఇప్పటికే ఎన్నో రికార్డులను దక్కించుకుందని, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ద్వారా మరో ఘనత దక్కిందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.