రేషన్ సరకుల వ్యవహారం ఏపీలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపులకు బదులుగా ఇంటివద్దకే వాహనంలో వచ్చి సరకులు పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాదాపు ఏడాదిగా అదే పద్ధతి కొనసాగించారు. కానీ ఇప్పుడు రేషన్ వాహనాలను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాబోయే మార్పులపై ఇప్పుడు చర్చ మొదలైంది. రేషన్ వాహనాలు నిలిపివేయడం సంచలన నిర్ణయమే. ఇప్పటి వరకు ఇంటి వద్దనే, లేదా వీధి చివరిలోనే రేషన్ సరకులు తీసుకునేవారు లబ్ధిదారులు. గతంలో లాగా రేషన్ షాపుల ముందు క్యూలైన్లు ఉండేవి కావు. ఈ పద్ధతిని సడన్ గా తీసేస్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారనే మాట వినపడుతోంది. దీనివల్ల వ్యతిరేకత వస్తే ఆ తర్వాత ప్రభుత్వమే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
క్యూలైన్ల సమస్య..
రేషన్ బండ్ల వద్ద సరకులు తీసుకోవడానికి ప్రజలు అలవాటు పడ్డారు. సడన్ గా వారిని తిరిగి రేషన్ దుకాణాలకు వెళ్లమంటే వెళ్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. అదే సమయంలో రేషన్ షాపుల వద్ద పెద్ద పెద్ద క్యూలైన్లు ఉంటే ప్రజలు అంతసేపు వేచి ఉంటారా..? లేక ప్రభుత్వాన్ని తిట్టుకుంటారా..? అనేది తేలాల్సి ఉంది.
వృద్ధులు, వికలాంగులకు ఇంటివద్దే..
అయితే ఇక్కడ ప్రభుత్వం చెప్పే లాజిక్ ఇంకోటి ఉంది. రేషన్ వాహనాల పేరుతో ప్రజా ధనం వృధా అయిందని, దాన్ని అరికట్టేందుకే పాత విధానాన్ని తెరపైకి తెస్తున్నామని అంటోంది ప్రభుత్వం. అదే సమయంలో వృద్ధులు, వికలాంగులకు మాత్రం ఇంటి వద్దకే రేషన్ అనే పద్ధతిని కొనసాగిస్తామని చెబుతోంది. ఇంటి వద్దకు వచ్చి రేషన్ ఇవ్వాలంటే.. ఈపోస్ మిషన్, తూకం వేసే మిషన్ వంటివి.. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు తీసుకు రావాల్సి ఉంటుంది. మరి దీనికి రేషన్ డీలర్లు అంగీకరిస్తారా..? అసలు వృద్ధులు, వికలాంగులకు రేషన్ ఎలా, ఎవరితో పంపిణీ చేయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రశ్నలన్నిటికీ జూన్-1న సమాధానం తెలుస్తుంది.
వాట్సప్ సేవలు..
రేషన్ డీలర్ల వద్ద సరకులు పంపిణీ చేయడానికి సిద్ధమైన ప్రభుత్వం, లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తామంటోంది. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా రోజుల్లో రేషన్ పంపిణీ చేసే సమయాన్ని కూడా ప్రకటించింది. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తారు. ఆదివారం సెలవు ఉండదు.
ఇక రేషన్ డీలర్లంతా లబ్ధిదారులతో ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ గ్రూప్ లో రేషన్ సరకులు ఇచ్చే తేదీలు, సమయాలను ముందుగానే వారికి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. మార్పులు, చేర్పులు ఏవైనా ఉంటే ఈ గ్రూప్ ద్వారా తెలియజేస్తారు. దీనివల్ల సమస్యలుంటే పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. రేషన్ డీలర్లు జవాబుదారీగా ఉంటారని కూడా అంచనా వేస్తోంది.