ఏపీ లిక్కర్ కేసులో ఏం జరుగుతోంది? ఇప్పటివరకు అధికారులపై దృష్టి పెట్టిన సిట్.. ఇప్పుడు నేతలపై గురిపెట్టారా? ఈ క్రమంలో చెవిరెడ్డిని అరెస్టు చేశారా? రేపో మాపో వైసీపీ కీలక నేతలు అరెస్టు కానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీ లిక్కర్ కేసు కేవలం అధికారుల మాత్రమే నడిపించారని నిన్నటివరకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కీలక నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అరెస్టు కావడంతో ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. అసలు లిక్కర్ కేసుకు ఈయనకున్న లింకేంటని ప్రశ్నిస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే.. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి తీసుకున్న నగదులో కొంత భాగాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేయడంలో చెవిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సిట్ గుర్తించింది. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అన్నింటికి తానై వ్యవహరించారట ఆయన.
ఏ క్షణమైనా సిట్ తనను అరెస్టు చేస్తుందని భావించిన ఆయన, శ్రీలంకకు పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు. చివరకు బెంగుళూరులో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడం, ఆ విషయాన్ని ఏపీ పోలీసులకు తెలపడం, సిట్ టీమ్ బెంగుళూరు వెళ్లి చెవిరెడ్డిని అరెస్టు చేయడం వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి.
అంతకుముందు ఈ కేసులో కీలకంగా ఉన్న నేతలపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకపోతే ఈ విషయం మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు దర్యాప్తు అధికారులు. చెవిరెడ్డి అరెస్టుతో ఈ కుంభకోణంలో అరెస్టయిన నిందితుల సంఖ్య తొమ్మిదికి చేరింది. రేపో మాపో మరో ఇద్దర్ని అరెస్టు చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. మద్యం కేసులో నుంచి తన పాత్ర బయట పడగానే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాస్టర్ ప్లాన్ చేశారు. దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులపై బురద జల్లడం, విచారణ ముందుకు వెళ్లకుండా ఆటంకం కలిగించడం చేస్తూనే ఉన్నారు.
తనవద్ద గన్మన్గా పని చేసిన హెడ్కానిస్టేబుల్ మదన్రెడ్డి, కీలక అనుచరుడు బాలాజీ యాదవ్లతో అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేయించారు. చెవిరెడ్డి పీఏ, గన్మెన్, డ్రైవర్లు, ఇతరులను విచారణకు పిలవడంతో తాను ఇరుక్కుపోయానని భావించారు చెవిరెడ్డి.
అధికారులకు కీలక ఆధారాలు దక్కడంతో అరెస్టు తప్పదని భావించారు చెవిరెడ్డి. చివరకు విదేశాలకు పారిపోయేందుకు స్కెచ్ వేశారు. మూడో కంటికి తెలియకుండా శ్రీలంకకు టూర్ ప్లాన్ చేశారు. చివరకు బెంగళూరు ఎయిర్పోర్టులో చిక్కారు.