ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం నాడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె తన సోదరుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతి విషయంలోనూ జగన్ ప్రజలను వంచించారని, అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రజల వద్దకు వెళ్లని ఆయన, ఇప్పుడు ఓటమి తర్వాత జన సమీకరణ పేరుతో బల ప్రదర్శనలకు దిగుతున్నారని ఆమె మండిపడ్డారు.
మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషాద ఘటనపై షర్మిల స్పందించారు. జగన్ కారు సైడ్ బోర్డుపై నిలబడి ప్రయాణించడం మొదటి తప్పని, ఆయన షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలోనే ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియోను ఫేక్ అని ప్రచారం చేయడం అత్యంత దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు.
జగన్ తీరును తూర్పారబడుతూ షర్మిల, “జగన్కు ఏ నిబంధనలు, ఆంక్షలు వర్తించవా? మూడు వాహనాలకు అనుమతి ఉంటే, ఏకంగా ముప్పై వాహనాలతో వెళుతున్నారు. కార్ల కింద అమాయకులను నలిపేస్తూ, మానవత్వం గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం?” అని తీవ్రంగా ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై సమాధానం చెప్పే ధైర్యం కూడా జగన్కు లేదని ఆమె దుయ్యబట్టారు. “రుషికొండలను ఎందుకు బోడిగా మార్చారు? మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి, మద్యం కుంభకోణానికి ఎందుకు పాల్పడ్డారు?” అంటూ జగన్పై ప్రశ్నల వర్షం కురిపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి నిలబెట్టాల్సిన అవసరం ఉందని భావించే అధిష్ఠానం తనను ఇక్కడికి పంపిందని షర్మిల తెలిపారు. తనకు, జగన్కు మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలతో పోలిస్తే చాలా చిన్నవని ఆమె అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే తమ మధ్య విభేదాలు తలెత్తాయని ఆమె వెల్లడించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని షర్మిల ఈ సందర్భంగా స్పష్టం చేశారు.