శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూర్ మహహ్మద్ అనే వ్యక్తికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. చూడటానికి అమాయకంగా కనిపించే వ్యక్తి, తెరవెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న వాట్సాప్ గ్రూపులతో సంబంధాలు నెరుపుతూ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నూర్ మహమ్మద్ అనే ఈ వ్యక్తితో పాటు మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ వి. రత్న మీడియాకు వెల్లడించారు.
ఎస్పీ రత్న తెలిపిన వివరాల ప్రకారం, ధర్మవరంలో చికెన్ బిర్యానీ విక్రయించే నూర్ మహమ్మద్పై కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం కొంతకాలంగా నిఘా పెట్టింది. ఇతను పాకిస్థాన్కు చెందిన 30కి పైగా వాట్సాప్ గ్రూపులలో సభ్యుడిగా ఉంటూ, కీలక సమాచారాన్ని పంచుకుంటున్నట్లు పక్కా ఆధారాలు సేకరించారు. అంతేకాకుండా, స్థానికంగా మసీదుల వద్ద యువకులను లక్ష్యంగా చేసుకుని, వారికి ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోసేందుకు ప్రయత్నించినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె వివరించారు.
పక్కా సమాచారంతో నిందితుడిని అరెస్ట్ చేసి, కడప జైలుకు తరలించినట్లు ఎస్పీ రత్న పేర్కొన్నారు. అతని పాకిస్థాన్ సంబంధాలు, ఉగ్రవాద సంస్థలతో ఉన్న లోతైన సంబంధాలపై పూర్తి వివరాలు రాబట్టేందుకు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని ఆమె స్పష్టం చేశారు. విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, ఒక చిన్న పట్టణంలో ఉగ్రవాద నెట్వర్క్ బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.