ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించి, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం, గుంటూరు ఛానల్పై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం మరియు రైతుల ప్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ముందుకు వచ్చి తమ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
రాజధాని ప్రాంతంలో రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రాబోయే రెండేళ్లలో డ్రైనేజీలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి అవుతాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా, సీడ్ యాక్సిస్ రహదారిని త్వరలోనే మంగళగిరి రహదారికి అనుసంధానించి అందుబాటులోకి తెస్తామని మంత్రి ప్రకటించారు. అలాగే, భవిష్యత్తులో అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూ సమీకరణ కూడా చేపడతామని, లంక భూములు, అసైన్డ్ భూముల్ని సమీకరణకు ఇచ్చిన వారి సమస్యలను వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అమరావతి పరిధిలోని 29 గ్రామాలలో పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. మొత్తం 66 వేల రిటర్నబుల్ ఫ్లాట్లలో ఇప్పటికీ 7 వేల ఫ్లాట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 30 నుంచి 60 మంది రైతులు తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నారని తెలిపారు. రైతులు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు పాల్గొన్నారు.

