దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేటికి 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోడరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. 2003 ఏప్రిల్ 9న చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు సాగిన 1457 కిలోమీటర్ల పాదయాత్ర తెలుగు ప్రజల గుండెల్లో చెక్కుచెదరని జ్ఞాపకమని, ఆ యాత్రే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ అధికారంలోకి తెచ్చిందని ఆమె గుర్తు చేశారు. వైఎస్సార్ పాదయాత్ర నేటి అభివృద్ధికి నిర్వచనమని, ఆయన పాలన ఒక స్వర్ణయుగమని ఆమె కొనియాడారు.
వారసులం అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి కేవలం వైఎస్సార్ పేరును వాడుకున్నారే తప్ప, ఆయన ఆశయాలకు వారసులు కాలేదని షర్మిల ఎద్దేవా చేశారు. “వైఎస్సార్ ఐడియాలజీ ఉంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక కూడా జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదు?” అని ఆమె ప్రశ్నించారు. వైఎస్సార్ తన జీవితకాలం వ్యతిరేకించిన బీజేపీకి జగన్ ‘దత్తపుత్రుడు’గా ఎలా మారారని ఆమె నిలదీశారు. క్రైస్తవ మైనారిటీలపై దాడులు జరుగుతుంటే వైఎస్సార్ వారసుడిగా జగన్ ఎందుకు ఖండించలేదని మండిపడ్డారు.
‘మాట తప్పం.. మడమ తిప్పం’ అనే మాటలు వాడుకోవడం తప్ప, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి కల్తీ మద్యంతో “ఓన్లీ క్యాష్” మాఫియాను నడుపుతున్నారని షర్మిల ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన ఉపాధి హామీ పథకాన్ని జగన్ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రుషికొండను మింగేసి సొంతానికి ప్యాలెస్లు కట్టుకున్నారని, జగన్ ఇప్పుడు కేవలం “మావిగన్ (MAVIGUN) జోకర్”గా మిగిలిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతు రుణమాఫీ వంటి పథకాలు ప్రజల కన్నీళ్ల నుంచి పుట్టినవేనని షర్మిల పేర్కొన్నారు. వైఎస్సార్ ఐడియాలజీ కేవలం కాంగ్రెస్ పార్టీలోనే బ్రతికి ఉందని, మహానేత ఆశయ సాధన మళ్లీ కాంగ్రెస్తోనే సాధ్యమని ఆమె స్పష్టం చేశారు. వైఎస్సార్ అభిమానులందరూ హస్తం పార్టీతో జతకట్టాలని, ఆనాటి సంక్షేమ పాలనను మళ్లీ తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు. “వైఎస్సార్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే వైఎస్సార్.” అని ఆమె తన సందేశాన్ని ముగించారు.

