ఏపీలో రాజకీయాలు ఇప్పుడిప్పుడే హాట్ హాట్గా మొదలయ్యాయి. పలు అంశాలపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఎంట్రీ ఇచ్చారు. సూటిగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలను టార్గెట్ చేశారు. మీరు వారికి దత్తపుత్రిక అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలేం జరుగుతోంది.
ఏపీ రాజకీయాల్లో షర్మిల వర్సెస్ రోజా
ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. అభివృద్ధి విషయం కాసేపు పక్కన బెడితే వారసుల వ్యవహారం రచ్చకెచ్చింది. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై పలు ప్రశ్నలు సంధించారు మాజీ మంత్రి రోజా. వైఎస్ఆర్కు నిజమైన వారసుడు జగన్ అని తేల్చేశారు. కూటమి పార్టీలకు షర్మిల దత్తపుత్రికగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఈ విషయంలో జగన్ గురించి మాట్లాడే అర్హత షర్మిలకు లేదన్నారు. వైఎస్ఆర్ని జీవితాంతం వ్యతిరేకించిన చంద్రబాబుతో చేతులు కలిపింది మీరు కాదా అంటూ ప్రశ్నలు సంధించారు. జగన్ పతనం కోసం తపనపడుతున్నది మీరు కాదా? జాతీయ స్థాయిలో కూటమి పార్టీలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తే ఏపీలో ఎందుకు చేతులు కలుపుతున్నారో ప్రజలకు తెలీదా?
వైఎస్ఆర్కు జగన్ నిజమైన వారసుడన్న రోజా
వైఎస్ఆర్కు ముమ్మాటికీ నిజమైన వారసుడు జగనేనని తేల్చేశారు. ఈ విషయాన్ని ప్రజలు ఎప్పుడో నిర్ణయించారని అన్నారు. రాష్ట్ర రాజకీయాలను, ప్రజల భవిష్యత్ను పేకాటగా చూస్తున్న మీరు రాజకీయ పరిణితి ఏ మాత్రం ఉందో అర్థమవుతోందని ఎక్స్లో పేర్కొన్నారు.
అంతకుముందు రోజు గురువారం వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా కీలక వ్యాఖయయలు చేశారు. దివంగత వైఎస్ఆర్ కుమారునిగా, పార్టీలో ఆయన పేరు పొందుపర్చి మీరు చేస్తున్నదేంటని ప్రశ్నించారు. పేదలు ప్రజల కోసం తపించిన వైఎస్ పథకాలు చేపట్టారని, ఇవాళ ఫాసిస్టు శక్తులకు తలవంచి వాళ్ళ క్యాపిటలిస్టు పోకడలకు దాసోహం మీరెక్కడంటూ ప్రశ్నించారు.
మొన్న ప్రకటించినట్టు మీరు చేయాల్సింది పాదయాత్ర కాదు, ఆత్మ విమర్శన యాత్ర అంటూ రాసుకొచ్చారు. మొత్తానికి ఏపీ రాజకీయాలు ఏమోగానీ.. అన్నాచెల్లెల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిందని రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు.

