AP

టిడిపి అభ్యర్థుల మూడో జాబితా సిద్ధం – అనూహ్య మార్పులు, లిస్టులో..!!

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలకు రంగం సిద్దమైంది. చంద్రబాబు ఈ రోజు లిస్టు విడుదల చేయనున్నారు. టీడీపీ తొలి రెండు జాబితాలో మొత్తం అసెంబ్లీ అభ్యర్థులనే ప్రకటించింది. తాజా లిస్టులో పార్లమెంట్ అభ్యర్థులతో పాటుగా పెండింగ్ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించేలా ప్లాన్ చేసారు. అయితే, జాబితాలో అనూహ్య నిర్ణయాలు కనిపిస్తున్నాయి. బిజెపితో పొత్తులో భాగంగా కేటాయించిన ఎంపీ సీట్ల పైన కొత్త అనిశ్చితి కొనసాగుతుంది. ఈరోజు ప్రకటించే టిడిపి జాబితాలో కొత్త పేర్లు తెరమీదకు వచ్చాయి.

 

మూడో జాబితా సిద్దం : తెలుగుదేశం మూడో జాబితా కొత్త పేర్లతో విడుదల కానుంది. తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. మూడో జాబితాలో ఎంపీ అభ్యర్థులను వెల్లడించనున్నారు. ఏలూరు లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పుట్టా మహేశ్‌ యాదవ్‌ ఖరారయ్యారు. ఏలూరు లోక్‌సభ సీటును ఈ దఫా బీసీలకు ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం భావించింది. మొదట గోపాల్‌ యాదవ్‌ అనే ప్రవాసాంధ్రుడి పేరు పరిశీలనకు వచ్చింది. తర్వాత ఆ పేరు వెనక్కి వెళ్లి తాజాగా మహేశ్‌ యాదవ్‌ పేరు ఖరారైంది. సీనియర్‌ నేత బీకే పార్థసారథిని హిందూపురం లోక్‌సభ స్థానానికి నిలపాలని టీడీపీ నాయకత్వం నిశ్చయించింది. ఆయన గతంలోనూ ఇక్కడి నుంచి లోక్‌సభకు గెలిచారు.

 

తెర పైకి కొత్త పేర్లు : బాపట్ల ఎంపీ స్థానానికి తాజాగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది అనంతపురం జిల్లాకు చెందిన మాజీమంత్రి శమంతక మణికి ఈయన అల్లుడు. అనంతపురం లోక్‌సభ స్థానానికి ఇంకా అభ్యర్థి పేరు ఖరారుకాలేదు. కర్నూలులో కూడా బీసీ అభ్యర్థినే నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం. బస్తిపాడు నాగరాజు అనే కురబ సామాజిక వర్గ నేతను ఆ స్థానానికి ఎంపిక చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈయన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్నారు. నంద్యాల సీటుకు బైరెడ్డి శబరి ఎంపికైనట్లు తెలిసింది. అమలాపురం (ఎస్సీ) ఎంపీ స్థానానికి దివంగత లోక్‌సభ స్పీకర్‌ బాలయోగి కుమారుడు హరీశ్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో అదనపు డీజీ హోదాలో పనిచేసి రిటైరయ్యారు. విజయనగరం లోక్‌సభ స్థానాన్ని సీట్ల సర్దుబాటులో బీజేపీకి ఇచ్చారు. దానిని వెనక్కి తీసుకుని రాజంపేట ఇవ్వాలని బీజేపీ కోరుతోంది.

 

మార్పులు – చేర్పులు : శ్రీకాకుళం అసెంబ్లీ సీటును గతంలో బీజేపీకి ఇచ్చారు. తాజా పరిణామాల్లో ఆ సీటును టీడీపీయే తీసుకుని దానికి బదులుగా ఎచ్చెర్ల సీటును బీజేపీకి కేటాయించినట్లు సమాచారం. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గురువారం హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. కొన్ని సీట్లలో అభ్యర్థులకు సంబంధించి వారి మధ్య చర్చ జరిగింది. తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక వ్యవహారం జనసేనలో హాట్‌ టాపిక్‌గా మారింది. అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులును మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన స్థానంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేరు వినవస్తోంది. కాకినాడ ఎంపీ సీటుకు జనసేన తరఫున ఉదయ్‌ శ్రీనివాస్‌ పోటీచేస్తారని పవన్‌ ఇటీవల ప్రకటించారు. అయితే ఆయన అభ్యర్థిత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో టిడిపి జాబితా విడుదల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతుంది