CINEMA

శంకర్ దాదా MBBS రీరిలీజ్ ట్రైలర్.. ఆయన ఇప్పుడు లేరు.. బాధగా ఉంది

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇక 2004లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతుంది.

మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే జంటగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో రిలీజ్ అయిన మున్నాభాయ్ MBBS కు రీమేక్ గా తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా ఓ రేంజ్ లో హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాను ఇప్పుడు మెగా ప్రొడక్షన్స్ ద్వారా నాగబాబు నవంబర్ 4న భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా రీరిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నాగబాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇక ఈ ఈవెంట్ లో నాగబాబు మాట్లాడుతూ.. “ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ మూవీ వచ్చి 19 ఏళ్లు అవుతోంది. ప్రతీ 20 ఏళ్లకు ఓ జనరేషన్ మారుతుంటుంది. టీవీ, యూట్యూబ్‌లో పాత సినిమాలను చూడరు. కానీ ఇలాంటి సినిమాలకు రిపీటెడ్ ఆడియెన్స్ ఎక్కువగా ఉంటారు. ఒకప్పుడు థియేటర్లో రిపీటెడ్ రన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఓటీటీ, చానెళ్లకు సినిమాలు వెళ్లిపోతున్నాయి. ఇలాంటి సినిమాలను థియేటర్లోనే ఎక్స్‌పీరియెన్స్ చేయాలి. మళ్లీ 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లేలా ఉంటుంది. అప్పుడు అన్నయ్య గారు ఎంతో అందంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏదో అలా వస్తే చిన్న సీన్ చేయించారు. వైష్ణవ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. నా ఫ్రెండ్ ఆహుతి ప్రసాద్ ఇప్పుడు లేరు. ట్రైలర్ చూశాకా ఇవన్నీ నాకు గుర్తొచ్చి బాధ, సంతోషం కలిగాయి” అని తెలిపాడు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. “2004ని నేను ఎప్పుడూ మరిచిపోలేను. నేను హీరోగా ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే మున్నాభాయ్ లగేరహో రీమేక్ గురించి వార్త వినిపించింది. హీరో పక్కన ఉండే కారెక్టర్ నాకు ఎలా ఉంటుంది అన్నయ్యా? అని చిరంజీవి గారిని అడిగాను. నవ్వి వదిలేశారు. చివరకు ఆ పాత్ర నాకు వచ్చింది. అన్నయ్యతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయనది ఎంతో కష్టపడేతత్త్వం. ఇప్పటికీ నన్ను ఏటీఎం అని పిలుస్తుంటారు. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవుతోంది. పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ.. “శంకర్ దాదా ఎంబీబీఎస్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. వెస్ట్ గోదావరి ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేశాను. ఆ టైంలో నాకు ఎంతో లాభాన్ని తెచ్చి పెట్టింది. ఈ సినిమాతోనే నాకు మెగా డిస్ట్రిబ్యూటర్ అనే పేరు వచ్చింది. అలాంటి సినిమా మళ్లీ రీ రిలీజ్ అవుతుండటం నాకు ఆనందంగా ఉంది” అని తెలిపాడు.

ధర్మేంద్ర మాట్లాడుతూ.. “నాగబాబు గారు మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. శ్రీకాంత్ గారు మాకు ఎప్పుడూ ఏటీఎం లాంటి వారే. నవంబర్ 4న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నామని అన్నాడు.