యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ దీపావళి బ్లాస్ట్ చిత్రం ‘డ్యూడ్’ అద్భుతమైన రెస్పాన్స్తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి హౌస్ ఫుల్గా రన్ అవుతోంది. అక్టోబర్ 17న విడుదలైన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు అందించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర యూనిట్ ‘డ్యూడ్ దివాళి బ్లాస్ట్’ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ, తన గత చిత్రాలైన ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ల కంటే ‘డ్యూడ్’కి తెలుగు ప్రేక్షకులు అంతకు మించిన ఆదరణ, అభిమానం చూపించారని, అందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాత నవీన్ యర్నేని మాట్లాడుతూ, ‘డ్యూడ్’ విజయం తమకు మంచి దీపావళి గిఫ్ట్ అని సంతోషం వ్యక్తం చేశారు. ప్రదీప్ గత సినిమాలతో పోలిస్తే, ‘డ్యూడ్’ కొన్ని ఏరియాల్లో నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్లు సాధిస్తోందని వెల్లడించారు. ఈ చిత్రం ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 22 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని, ఇది దివాళి బిగ్ విన్నర్ అని ప్రకటించారు. నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ, ఈ జెన్జీ కాన్సెప్ట్లో ఫ్యామిలీ ఎమోషన్స్ బ్లెండ్ చేసి క్రియేట్ చేసిన కొత్త జోనర్ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని, సినిమాలో 20 ఎక్స్ట్రార్డినరీ బ్లాక్స్ ఉన్నాయని తెలిపారు.
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, ‘డ్యూడ్’ తెలుగులో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందని, ప్రదీప్ రంగనాథన్ను తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఓన్ చేసుకున్నారని అన్నారు. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారని, ఈ సినిమాకు పెద్ద రన్ ఉండబోతుందని, సెకండ్ షో నుంచే రిపీట్ ఆడియన్స్ ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో పెద్ద బ్లాక్ బస్టర్ నెంబర్స్ నమోదు అవుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఇంతటి అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.

