మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్ఫ్రెండ్’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొని రష్మికపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ముగ్గురు కుమారులు (వెంకటేష్, అల్లు అర్జున్, శిరీష్) ఉన్నారని గుర్తుచేస్తూ, “నాకు రష్మిక లాంటి కూతురు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది” అని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర కథలో మహిళా పాత్రను మోయగలిగే సామర్థ్యం రష్మికకే ఉందని, ఆమె నటన అద్భుతంగా ఉందని, బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చినా ఆశ్చర్యం లేదని అరవింద్ పేర్కొన్నారు.
‘ది గర్ల్ఫ్రెండ్’ కథను రాహుల్ రవీంద్రన్ మొదట 2021లో ‘ఆహా’ ఓటీటీ కోసం వెబ్ సిరీస్గా తనకి చెప్పారని, కానీ ఆ కథను సినిమాగా తీస్తే బాగుంటుందని తాను భావించానని అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ ప్రేమకథ సున్నితమైనదని, ఇప్పటివరకూ ఇలాంటి కథను ఎవరూ తెరకెక్కించలేదని రష్మిక మందన్న కూడా అన్నారు. ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ పరోక్షంగా విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న బంధాన్ని ప్రస్తావించారు. ‘ది గర్ల్ఫ్రెండ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు విజయ్ దేవరకొండను తీసుకొద్దామని, ఆయనొస్తే ఈవెంట్ బాగుంటుందని అన్నారు. దీక్షిత్ శెట్టి నటన కూడా చాలా ఇంటెన్స్గా ఉందని, వీళ్లందరినీ శిల్పాలుగా చెక్కింది దర్శకుడు రాహుల్ రవీంద్రనే అని ఆయన కొనియాడారు. ఈ సినిమాపై రష్మిక ఎంతో నమ్మకంగా ఉందని, రిలీజయ్యాకే రెమ్యూనరేషన్ తీసుకుంటానని చెప్పినట్లు నిర్మాత ధీరజ్ మొగిలినేని తెలిపారు.

