National

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ రాబోతుంది. ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన త్వరలోనే ఉండబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

డీఏ ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1 నుంచి వర్తించనుంది. డీఏ పెరుగుదలతో ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయి. డీఏ పెంపుపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. నాలుగు శాతం పెరిగే అవకాశం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఏడాది మొదటి డీఏ 4 శాతం పెరిగిన విషయం తెలిసిందే. దీంతో 38 శాతం నుంచి 42 శాతానికి డీఏ చేరుకుంది. ఈ సారి మరో 4 శాతం పెరిగితే.. 46 శాతానికి చేరుకుంటుంది.

ఈసారి జూలై 1 నుంచి ఉద్యోగులు పొందే డీఏలో ట్రావెల్ అలవెన్స్, సిటీ అలవెన్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా డీఏ పెంపుతో ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీలో కూడా పెరుగుదల ఉంటుంది. డీఏ పెంపు ట్రావెల్ అలవెన్స్ (టీఏ)పై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ ప్రయోజనాలను కూడా పొందుతారని భావిస్తున్నారు. పీఎఫ్‌, గ్రాట్యుటీ ప్రాథమిక జీతం +డియర్‌నెస్ అలవెన్స్ ఆధారంగా లెక్కిస్తారు. డీఏ పెంపుతో ఈ అలవెన్సులు పెరగడం ఖాయం. డీఏ పెంపు పింఛనుదారులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. వారి డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)లో మార్పువస్తుంది.

డియర్‌నెస్ రిలీఫ్ కూడా డియర్‌నెస్ అలవెన్స్‌తో ముడిపడి ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఉద్యోగి పదవీ విరమణ తర్వాత డియర్‌నెస్ రిలీఫ్‌గా అందుబాటులో ఉంటుంది. డియర్‌నెస్ రిలీఫ్ కూడా 42 శాతం నుంచి 46 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు నెలవారీ పెన్షన్ పెరుగుతుంది. సెప్టెంబర్ నెలలో డీఏ పెంపును ప్రకటించయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..!