National

రైల్వే స్టేషన్లు భవిష్యత్‌లో ఇలా ఉండబోతోన్నాయ్..!!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టబోతోన్నారు. ఒకేసారి దేశంలో 508 రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మొత్తంగా 24,470 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది.

ఆయా రైల్వే స్టేషన్లన్నీ కూడా మల్టీ పర్పస్ సెంటర్లుగా ఆవిర్భవించనున్నాయి. సిటీ సెంటర్స్‌గా అభివృద్ధి చెందనున్నాయి. దీనికి అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను రైల్వే శాఖ ఇదివరకే సిద్ధం చేసింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేయడానికి తెలంగాణలో 21, ఏపీలో 15 స్టేషన్లను కేంద్రం ఎంపిక చేసింది.

ఈ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ దేశ రాజధాని నుంచి ఈ 508 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన చారిత్రక వారసత్వ సంపద, సంస్కృతిని ప్రతిబింబించేలా రైల్వే శాఖ ఆ రైల్వే స్టేషన్లను రీడెవలప్‌మెంట్ చేయనుంది. ఇందులో వాస్తుకూ ప్రాధాన్యత ఇవ్వనుంది.

ఈ పథకం కింద ఉత్తరప్రదేశ్-55, రాజస్థాన్‌-55, బిహార్‌-49, మహారాష్ట్ర- 44, పశ్చిమ బెంగాల్‌- 37, మధ్యప్రదేశ్‌- 34, అస్సాం- 32, ఒడిశా- 25, పంజాబ్‌- 22, గుజరాత్-21, తెలంగాణ-21, జార్ఖండ్‌- 20, తమిళనాడు-18, ఏపీ-15, హర్యానా-15, కర్నాటక- 13 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మూడు సంవత్సరాల కాల పరిమితిలో వాటన్నింటినీ రీ డెవలప్‌ చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

అత్యాధునిక ఆర్కిటెక్చర్‌, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆయా స్టేషన్లన్నీ అభివృద్ధి చెందుతాయి. దివ్యాంగుల కోసం వీల్ ఛైర్లను అందుబాటులో ఉంచుతారు. ఆధునిక ట్రాక్‌లను ఏర్పాటు చేస్తారు. ర్యాంపులు, కేఫ్‌ ఏరియా, రెస్ట్‌రూమ్స్‌ హైస్పీడ్‌ వైఫై 5జీ సేవలు ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొస్తారు.

హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో మల్కాజ్‌గిరి, హైటెక్ సిటీ, హుప్పుగూడ, హఫీజ్‌పేట్ స్టేషన్లు ఈ పథకం కింద ఎంపికయ్యాయి. భవిష్యత్తులో ఆయా స్టేషన్లు ఎలా రూపుదాల్చుతాయో తెలియజేసేలా దక్షిణ మధ్య రైల్వే అధికారులు.. వాటికి సంబంధించిన గ్రాఫిక్ డిజైన్లను విడుదల చేశారు.