National

ఈసీ చేతికి రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలు.. సుప్రీంకోర్టులో ఎస్బీఐ అఫిడవిట్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా‌.. మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానం గడప తొక్కింది. అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి అందజేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. దాన్ని పాటించినట్లు వివరించింది.

 

ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలంటూ సుప్రీంకోర్టు.. గతంలో ఎస్బీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇచ్చే ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై కిందటి నెల 15వ తేదీన సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

 

ఈ బాండ్లను జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు అయిదుమంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ)తో పాటు సమాచార హక్కు చట్టం ఉల్లంఘన కిందికి ఇవి వస్తాయని పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడం క్విడ్ ప్రొ కొ కిందికి వస్తుందని స్పష్టం చేసింది.

 

దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా ఈ నెల 12వ తేదీ నాటికి కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుందని ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే- వాటిని ఎవరు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? మొత్తం ఎంత అనే వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.

 

ఈ నేపథ్యంలో ఎస్బీఐ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 12వ తేదీ సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి మొత్తం ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్నింటినీ అందజేసింది. ఈ విషయాన్ని ఈసీ కూడా ధృవీకరించింది. ఎస్బీఐ నుంచి ఎలక్టోరల్ బాండ్ల వివరాలు తమకు అందినట్లు తెలియజేసింది.

 

ఇదే విషయాన్ని తాజాగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది ఎస్బీఐ. ఈ మేరకు ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. 2019 ఏప్రిల్ 1 నుంచి 11వ తేదీ వరకు మొత్తం 3,346 ఎలక్టోరల్ బాండ్లను విక్రయించామని, అందులో 1,609 బాండ్లు రీ డీమ్డ్ అయ్యాయని అఫిడవిట్‌ ద్వారా సుప్రీంకోర్టుకు వివరించింది.

 

2019 ఏప్రిల్ 12వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 12వ తేదీ వరకు 18,871 బాండ్లను విక్రయించామని తెలిపింది. పాతవాటిని కూడా కలుపుకొని మొత్తం 20,421 ఎలక్టోరల్ బాండ్లు రీ డీమ్డ్ అయినట్లు ఎస్బీఐ పేర్కొంది. కాగా- ఎస్బీఐ అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్నింటినీ కూడా ఈ నెల 15వ తేదీన సాయంత్రం 5 గంటల్లోగా కేంద్ర ఎన్నికల కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది.