National

కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు వెలువరించనున్న ఢిల్లీ హైకోర్టు..

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది.

 

హైకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన జాబితా ప్రకారం, జస్టిస్ స్వర్ణ కాంత శర్మ మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తారు.

 

తన అరెస్ట్‌తో పాటు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో తన తదుపరి రిమాండ్‌ను కూడా కేజ్రీవాల్ సవాలు చేశారు. అనంతరం కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. AAP జాతీయ కన్వీనర్ ఈడీ తనని అరెస్టు చేసిన సమయంపై ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా, నిష్పాక్షికమైన ఎన్నికలు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్‌తో సహా రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి ఇది విరుద్ధంగా ఉందని అన్నారు.

 

ఈడీ ఈ అభ్యర్థనను వ్యతిరేకించింది. కేజ్రీవాల్‌కు, “ఆమ్ ఆద్మీ”కి సమానంగా చట్టం వర్తింపచేసామన్నది. రాబోయే ఎన్నికల కారణంగా అరెస్టు నుంచి విముక్తి పొందలేరని వాదించింది.

 

ఫెడరల్ యాంటీ మనీలాండరింగ్ ఏజెన్సీ బలవంతపు చర్య నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించడంతో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఈడీ కస్టడీ గడువు ముగియడంతో ఏప్రిల్ 1న ట్రయల్ కోర్టులో హాజరుపరచగా, ఈ కేసులో కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.