National

దాయాది దేశం ప్రకటన.. సైనిక చర్యకు భారత్ రెడీ..!

పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌లో అసలైన వణుకు మొదలైందా? భారత్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందనని భయంతో వణికిపోతుందా? తమ మీద భారత్ దాడి చేయడం ఖాయమని ఎందుకు అంటున్నారు పాక్ మంత్రులు? ఈ లెక్కన ఉగ్రదాడి గురించి వారికి ముందే తెలుసా? జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. భారత్ మరో 24 నుండి 36 గంటల్లో పాకిస్తాన్‌పై సైనిక చర్యకు దిగే అవకాశం ఉందన్నారు ఆదేశ సమాచార శాఖమంత్రి అట్టాఉల్లా తారర్. దీనికి సంబంధించి రహస్య సమాచారం తమ దగ్గరుందన్నారు. తమపై దాడికి పాల్పడితే అందుకు తగిన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారయన.

 

ప్రధాని ప్రకటన

 

పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలు నిశితంగా పరిశీలిస్తోంది పాకిస్తాన్. మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ పలు సమావేశాలతో బిజీగా ఉన్నారు. సాయంత్రం సైనిక అధికారులతో కీలక సమావేశం జరిగింది. పహల్‌గామ్ ఉగ్ర దాడికి ప్రతి స్పందనపై నిర్ణయం భద్రతా బలగాలదేనని తేల్చిచెప్పారు ప్రధాని మోదీ. ఎక్కడ, ఎప్పుడు, ఎలా దాడి చేయాలోనిర్ణయించుకునే స్వేచ్ఛ వారిదేనన్నారు. సైన్యం శక్తి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. ప్రధాని కార్యాలయం నుంచి ఈ ప్రకటన రాగానే పాకిస్థాన్‌లో భయం మరింత పెరిగింది.

 

పాక్‌లో భయం రెట్టింపు

 

తాజాగా పాకిస్తాన్ సమాచార మంత్రి అట్టాఉల్లా తారర్ ఈ ఉదయం ఓ వీడియో రిలీజ్ చేశారు. నిరాధారమైన ఆరోపణలతో పాకిస్తాన్‌పై సైనిక చర్యకు భారత్ రెడీ అవుతోందని ఆరోపించారు. పాక్ ఎప్పటి నుంచో ఉగ్రవాద బాధిత దేశమన్నారు. ఇందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతర్జాతీయ సంస్థ నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని తమ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఆయన గుర్తు చేశారు.

 

భారత్ మాత్రం పాక్ ప్రతిపాదనను తిరస్కరించిందని ప్రస్తావించారు. భారత్ చేసే ఎలాంటి సైనిక చర్యకైనా తమ నుంచి అదే స్థాయిలో ప్రతిస్పందన ఉంటుందన్నారు. ఉద్రిక్తతలు తీవ్రమైతే దాని పర్యవసానాలకు భారత్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ మీద భారత్ దాడి చేయడం ఖాయమని చెప్పుకొచ్చారు. మరో 24 నుండి 36 గంటల్లో పాకిస్తాన్‌పై సైనిక చర్యకు దిగే అవకాశం ఉందన్నారు అట్టాఉల్లా తారర్. దీనికి సంబంధించి తమకు రహస్య సమాచారం ఉందన్నారు.

 

ఉగ్రదాడి దర్యాప్తులో

 

పహల్‌గామ్‌ ఘటనపై అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తోంది. దీనిపై కీలక విషయాలను వెలుగులోకి వచ్చాయి. పహల్‌గామ్‌లో బైసరన్ ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద పర్యాటకులు తప్పించుకోకుండా మూసివేసి ఆపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు మరణించారు. దాడిలో కేవలం నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు తెలిపింది.

 

హిందువులు-ముస్లింలు వేరు చేసి కాల్చి చంపడం ఈ ఎపిసోడ్‌లో అత్యంత దారుణమైన ఘటన. ఇది హిందూయిజం టార్గెట్‌గా చేసిన దాడిగా భావిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. తొలుత నేవీ అధికారి నర్వాల్ కాల్చి చంపారని ఎన్ఐఏ చెబుతున్న మాట. చాయ్-బేల్‌పురి స్టాల్స్ వద్ద మరణాలు ఎక్కువగా జరిగాయి. కాల్పుల తర్వాత అటవీ ప్రాంతం వైపు ఉగ్రవాదులు పరారైనట్టు ఎన్ఐఏ దర్యాప్తు సారాంశం.

 

కాల్పుల సమయంలో ఉగ్రవాదులు పెయిడ్ ఎన్‌క్లిప్ట్ మొబైల్ యాప్ ద్వారా వారి అధినేతలతో మాటలు సాగినట్టు అంచనాకు వచ్చారు. నలుగురులో ఒకరు పాక్ ఆర్మీలో కమోండో పని చేస్తున్నాడు. దీంతోపాటు ఇంటెలిజెన్స్ వర్గాలు కొన్ని విషయాలు బయటపెట్టాయి. పహల్‌గామ్ దాడి వెనుక పాక్ ఆర్మీ చీఫ్ మున్నీర్ కుట్ర ఉందని భావిస్తున్నాయి. అతని పదవీకాలం పొడిగించుకునేందుకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. మున్నీర్ కరుడుగట్టిన యాంటీ హిందువు కావడంతో హిందువులను ఏరి కోరి చంపారు ఉగ్రవాదులు.

 

నిఘా వర్గాలేమంటున్నాయి?

 

పహల్‌గామ్‌ ఘటన తర్వాత సరిహద్దులో తన సేనల్ని మొహరిస్తోంది పాకిస్తాన్. ఎల్ఓసీ వద్ద తన సైన్యాన్ని రంగంలోకి దించింది దాయాది దేశం. పీఓకేలో ఉగ్రవాదుల లాంచింగ్ పాడ్స్ ఉన్నట్లు గుర్తించాయి భారత్ నిఘా వర్గాలు. కోటా పనాల్ నార్త్ ఏరియాలో హెజ్బుల్ లాంచ్ పాడ్ ఉంది. అక్కడ కమాండ్‌గా జతూర్ లీడ్ చేస్తున్నాడు. కోటా బజార్ ప్రాంతంలో మరో లాంచింగ్ పాడ్ ఉంది. దీనికి లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు లీడ్ చేస్తున్నారు. మూడో లాండ్ పాడ్ వద్ద అన్నిసంస్థల ఉగ్రవాదులు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉగ్రవాదుల లాంచ్ పాడ్‌లను ఖాళీ చేయిస్తోంది పాక్ సైన్యం. వారిని ఆర్మీ సెల్టర్లు, బంకర్లకు తరలిస్తుందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.