హర్యానాలో సంచలనం సృష్టించిన గూఢచర్యం కేసులో ఓ ప్రముఖ యూట్యూబర్తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా, భారత సైనిక రహస్యాలను పాకిస్థాన్కు చేరవేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనతో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ వేదికలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ట్రావెల్ వీసాపై పాకిస్థాన్లో పర్యటించిన జ్యోతి మల్హోత్రా, అక్కడ పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేసి, భారత దేశానికి చెందిన కీలక సైనిక సమాచారాన్ని వారికి చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణాలకు సంబంధించిన వీడియోలు రూపొందించే జ్యోతి, పాకిస్థాన్కు రహస్య సైనిక సమాచారం అందించారన్నది ప్రధాన అభియోగం. ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ అధికారి డానిష్తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయని, పాకిస్థాన్ పర్యటన సందర్భంగా ఈ సమాచారాన్ని చేరవేసిందని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.
జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన విషయాన్ని హిసార్ పోలీసు ప్రతినిధి వికాస్ కుమార్ ధృవీకరించారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నామని, మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సబ్-ఇన్స్పెక్టర్ సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిసార్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం, జ్యోతి మల్హోత్రా 2023లో ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ను సందర్శించారు. అక్కడ ఆమెకు పాకిస్థాన్ హైకమిషన్ (పీహెచ్సీ) ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్తో పరిచయం ఏర్పడింది. “తాను డానిష్తో నిరంతరం టచ్లో ఉన్నానని, 2023 పాకిస్థాన్ పర్యటనలో అలీ ఎహ్వాన్ను కలిశానని, తన బస, ప్రయాణ ఏర్పాట్లను అతనే చూసుకున్నాడని ఆ మహిళ విచారణలో వెల్లడించింది. ఎహ్వాన్ ఆమెను పాకిస్థాన్ భద్రతా, నిఘా అధికారులకు పరిచయం చేశాడు. అక్కడ ఆమె షకీర్, రాణా షాబాజ్లను కూడా కలిసింది” అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
అంతేకాకుండా, “ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు బ్లాగర్ జ్యోతి, షకీర్ పేరును తన ఫోన్లో ‘జాట్ రణధావా’ అని సేవ్ చేసుకుంది. 2023లో పాకిస్థాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా తన సహచరులతో సంప్రదింపులు జరుపుతూ వచ్చింది” అని పోలీసు ఎఫ్ఐఆర్ స్పష్టం చేసింది.
గడిచిన రెండేళ్లలో జ్యోతి మూడుసార్లు పాకిస్థాన్ను సందర్శించినట్లు తెలిసింది. యూట్యూబ్ వీడియోల కోసం ఆమె చైనా, బంగ్లాదేశ్, థాయ్లాండ్, నేపాల్, భూటాన్, యూఏఈ వంటి దేశాల్లో కూడా పర్యటించింది. పాకిస్థాన్లోని పరిస్థితులను తన సోషల్ మీడియా ద్వారా పర్యాటకులకు అనుకూలంగా ప్రచారం చేసే బాధ్యతను పాక్ నిఘా అధికారులు జ్యోతికి అప్పగించినట్లు సమాచారం. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.