బాలీవుడ్ కమెడియన్, హోస్ట్ కపిల్ శర్మ కెనడాలోని తన కేఫ్పై జరిగిన కాల్పుల ఘటనలపై స్పందించారు. ఈ ఘటనల నేపథ్యంలో తనకు భారతదేశంలో, ముఖ్యంగా ముంబై వంటి నగరంలో ఎటువంటి అభద్రతా భావం లేదని ఆయన స్పష్టం చేశారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో కపిల్ శర్మ కేఫ్పై కొన్ని నెలల వ్యవధిలోనే పలుమార్లు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. కాల్పుల ఘటనల అనంతరం తన కేఫ్కు మరింత మంది అతిథులు వచ్చారని, ప్రతి కాల్పుల ఘటన తర్వాత తన కేఫ్కు మరింత ఆదరణ లభించిందని ఆయన వెల్లడించారు.
కెనడాలో జరిగిన ఈ సంఘటనల గురించి చాలా మంది తనకు ఫోన్ చేసి ఆరా తీశారని కపిల్ శర్మ తెలిపారు. స్థానిక నిబంధనల కారణంగా అక్కడి పోలీసులకు ఇటువంటి ఘటనలను నియంత్రించే అధికారం లేకపోయినప్పటికీ, తన కేఫ్పై కాల్పుల వ్యవహారం కెనడా ప్రభుత్వం దృష్టికి వెళ్లిందని, అక్కడి పార్లమెంట్లో కూడా దీనిపై చర్చ జరిగిందని ఆయన అన్నారు. ముంబై వంటి నగరం మరొకటి లేదని ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో కపిల్ శర్మ తన కేఫ్ను ప్రారంభించారు. ఈ ఏడాది జులైలో తొలిసారి, ఆ తర్వాత ఆగస్టు, అక్టోబర్ నెలల్లోనూ ఈ తరహా కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమని కూడా ఎవరూ ప్రకటించలేదని కపిల్ శర్మ వెల్లడించారు.

