APNationalTELANGANA

పొలిటికల్ యాడ్స్ రద్దు.. ఈసీ కీలక నిర్ణయం..

తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రచార అస్త్రం కీలకం. అయితే.. ప్రచారంలో భాగమైన కొన్ని పొలిటికల్‌ యాడ్స్‌ని నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. తాము అనుమతి ఇచ్చిన ప్రకటనలను మార్చేసి, ప్రసారం చేస్తున్నారంటూ 15 యాడ్స్‌ను ఈసీ రద్దు చేసింది. దీని వెనుక బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా, క్రియేటివ్‌గా యాడ్స్ రూపొందించి ప్రచారం చేయడంతో ప్రజల్లో అనూహ్య స్పందన వచ్చిందని, అవి అలాగే కొనసాగితే ఓడిపోతామని భయపడే బీఆర్‌ఎస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. కాంగ్రెస్‌ యాడ్స్‌తో బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనే భయంతోనే గులాబీ నేతలు కుట్రలకు తెర తీశారని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. ప్రకటనల రద్దుపై ఈసీని కలిసి.. అప్పీల్‌ చేస్తామని చెబుతున్నారు.

 

ఎన్నికల ప్రచారంలో భాగంగా రూపొందించిన 15 ప్రకటనలను రద్దు చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రద్దైన యాడ్స్‌లో బీఆర్‌ఎస్‌ యాడ్‌ ఒక్కటి మాత్రమే ఉండగా, కాంగ్రెస్‌వి 9, బీజేపీవి 5 ఉన్నాయి. ఇకపై వీటిని టీవీ ఛానెళ్ళలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలలో ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలకు సీఈవో వికాస్ రాజ్ లేఖ రాశారు. ఆ ప్రకటనల ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని ఛానళ్లకు సూచించారు. దాంతో.. ప్రకటనల రద్దు వెనుక బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందంటూ కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది

.