TELANGANA

తెలంగాణలో నాలుగో పారిశ్రామిక విప్లవం.. దావోస్‌లో ఒప్పందాలు..!

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(World Economic Forum) ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్(Fourth Industrial Revolution) హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా -2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఇది ప్రారంభం కానుంది.

 

సీఎం రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) సారధ్యంలో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే(Borg Brende) ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. అనంతరం సంయుక్తంగా ప్రకటన చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో టెక్నాలజీ కలయికతో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తెలంగాణకు విశిష్ట సహకారం అందించింది.

 

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రపంచ స్థాయిలో పని చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలపై దృష్టి కేంద్రీకరిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరువురి భాగస్వామ్యంతో ప్రజల ఆరోగ్యం, సాంకేతికత, మంచి జీవితం అందించాలనే లక్ష్యాలను వేగంగా అందుకోవచ్చని అన్నారు.

 

ఐదు ఖండాలలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెట్‌వర్క్‌ విస్తరించి ఉంది. ఇందులో తెలంగాణ సెంటర్ ప్రపంచంలో 19వది కావడం విశేషం. హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్‌ నేపథ్యంతో ఉన్నమొదటి కేంద్రం హైదరాబాద్‌లోనే ప్రారంభమవనుంది. ఆసియాలోనే స్వయం ప్రతిపత్తి కలిగిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ హాట్‌స్పాట్‌గా పరిగణిస్తారు. ఇది లాభాపేక్ష లేని సంస్థ. ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ కోసం పాలసీ, పాలనపై నాయకత్వం వహిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఇంక్యుబేటర్ల ద్వారా రాబోయే 5 సంవత్సరాలలో 20 వేల స్టార్టప్‌లపై ప్రభావం చూపాలని లక్ష్యంగా పెట్టుకుంది.