TELANGANA

ఎలివేటెడ్ కారిడార్‌కు సీఎం రేవంత్ భూమి పూజ ..

కేంద్రంలో ఎవరున్నా తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని అడుగుతూనే ఉంటామని, సహకరించకపోతే ప్రజలిచ్చిన శక్తితో కొట్లాడుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి అభివృద్ధిని కుంటుపరుస్తుందన్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలకమైన రాజీవ్‌ రహదారి ఎలివేటెడ్‌ కారిడార్‌కు ముఖ్యమంత్రి గురువారం భూమి పూజ చేశారు.

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్ అభివృద్ధి చెందడమే కాకుండా.. కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని, ప్రజల అవసరాలను విస్మరించిందని విమర్శించారు.

 

తాము అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, రక్షణ శాఖ మంత్రి రాజ్జ్‌థ్‌ను కలిసి ప్రాజెక్టు అవసరాన్ని వివరించామని తెలియజేశారు. ఈ కారిడార్‌ కోసం స్థానిక లోక్‌సభ సభ్యుడిగా అనేకసార్లు కేంద్రాన్ని కోరాననీ, కంటోన్మెంట్‌ బోర్డు సమావేశాల్లో కూడా లేవనెత్తానని గుర్తుచేశారు.

 

ఈ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు కేటాయించాల్సిన భూములను కేటాయించలేదని, అలాగే చాంద్రాయగుట్ట రక్షణ శాఖ భూముల లీజును రెన్యువల్‌ చేయకుండా గత ప్రభుత్వం జాప్యం చేసిన విషయాన్నీ ముఖ్యమంత్రి వివరించారు. అధికారంలోకి రాగానే అధికారులతో సమీక్షించి రక్షణ శాఖకు భూములు అప్పగించామన్నారు. “కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో రాష్ట్రానికి కేంద్రం సహకరించింది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ విధానాలతో ప్రజలకు శిక్ష పడింది ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఎలివేటేడ్ కారిడార్ పూర్తవ్వాలి. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగాం. రాజకీయాల కోసం కాదు. ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు. తర్వాత అభివృద్ధే మా విధానం” అని సీఎం అన్నారు.

 

ఓఆర్‌ఆర్‌ నిర్మాణం, అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్‌ సిటీ వంటి అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి హైదరాబాద్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని గుర్తుచేశారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.‌ ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట వరకు 6 లేన్లతో 11.3 కిలోమీటర్ల పొడవున నిర్మించబోయే ఈ కారిడార్‌పై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పలు వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ అడిగి తెలుసుకున్నారు.