ఇంటర్ సిలబస్ను తెలంగాణ ప్రభుత్వం తగ్గిస్తుందా? విద్యార్థులపై ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటుందా? పాఠాలు తగ్గించి, క్వాలిటీ పెంచాలని భావిస్తుందా? నిపుణుల కమిటీ ఏం చెప్పింది? అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుందా? అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.
రెండేళ్ల కిందట ఇంటర్ సిలబస్లో మార్పులు చేసింది సీబీఎస్ఈ. కొన్ని పాఠాలను తొలగించింది.. ట్రెండ్కు అనుగుణంగా కొన్ని సబ్జెక్టులను ప్రవేశపెట్టింది. పోటీ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు పెరుగుతున్నాయి. అందువల్లే ఈ నిర్ణయం తీసుకుందంటూ వార్తలు వచ్చాయి.
తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏర్పడి ఏడాది గడిచిపోయింది. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ సిలబస్ కుదించాలని నిర్ణయానికి వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఎక్స్పర్ట్ కమిటీ వాటిని పరిశీలించింది. ఇంటర్లో ఎంపీసీ, బైసీపీ, కామర్స్, ఆర్ట్స్ సిలబస్ను కుదించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఇంటర్ బోర్డు నిర్ణయం వెనుక కారణాలు లేకపోలేదు. ఎన్సీఈఆర్టీ సూచించిన దానితోపాటు అదనంగా సిలబస్ ఉండంతో దాన్ని తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇంటర్ కెమిస్ట్రీలో 20- 30శాతం, ఫిజిక్స్లో 5- 15 శాతం, జువాలజీ, బాటనీలో ఐదు లేదా 10 శాతం వరకు కోత ఉండవచ్చని తెలుస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా 2,700లకు పైగా ఇంటర్ కాలేజీలున్నాయి. అందులో దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవలకాలంలో ప్రభుత్వం క్వాలిటీ ఎడ్యుకేషన్పై ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో సిలబస్ మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. పరిమితికి మించి సిలబస్ ఉన్నట్లు గుర్తించింది.
మరోవైపు జేఈఈ, నీట్లతోపాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని కుదించాలన్నది బోర్డులో కొందరు అధికారుల మాట. ఏయే ఛాప్టర్లు తొలగించాలనే దానిపై ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా చదువుల విషయంలో విద్యార్థులు ఒత్తిడికి గురైనట్టు గుర్తించిందట ఆ కమిటీ.
ఇంటర్ ఫస్టియర్, సెంకడ్ ఇయర్లలో సైన్స్ సబ్జెక్టుల్లో ఎక్కువగా సిలబస్ ఉన్నట్లు గుర్తించారట. ఫిజిక్స్, కెమిస్ట్రీలో రెండు లేదా మూడు ఛాప్టర్లకు కోత పెట్టే అవకాశముంది. అలాగే ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టుల్లో కొంత సిలబస్ కోత పడనుంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే కొత్త సిలబస్ ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఇంటర్ సెకండియర్కి 2026 నుంచి అమలు కానుంది.