కులగణన సర్వే తప్పుల తడకని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, దీనిని తాము స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కుల గణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో, కుల గణనలో పాల్గొనని వారి కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఈ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ, అసంపూర్తి లెక్కలతో అసెంబ్లీలో తీర్మానం చేయడం తప్పేనని ప్రభుత్వం అంగీకరించాలని కేటీఆర్ అన్నారు. బీసీలను తీవ్ర మనోవేదనకు గురి చేశారని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రెండోసారైనా కుల గణన సర్వేను సమగ్రంగా, పారదర్శకంగా చేయాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి నెట్టివేస్తే అంగీకరించే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.