తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం తథ్యమని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మనం తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్కు ఏమీ కాదని స్పష్టం చేశారు.
తెలంగాణ అస్థిత్వ పార్టీ బీఆర్ఎస్ అని ఆయన ఉద్ఘాటించారు. గత గాయాల నుండి కోలుకున్న తెలంగాణను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే స్థితికి తీసుకువెళుతోందని విమర్శించారు. తెలంగాణ మరోసారి దోపిడీ, వలసదారుల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. తెలంగాణ ప్రజల శాశ్వత విజయమే బీఆర్ఎస్ లక్ష్యమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోందని అన్నారు.
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవదని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుత ఈ ముఖ్యమంత్రిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఇంత త్వరగా ఆయనపై వ్యతిరేకత వస్తుందని ఊహించలేదని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఆదాయం పెంచుకుంటూ వెళ్లామని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే అధికారులు ఉన్నారని, కానీ ప్రభుత్వం వారితో సరిగ్గా పని చేయించుకోవడం లేదని విమర్శించారు. ఏప్రిల్ 10వ తేదీ నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని, జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.