TELANGANA

అమ్మాయిలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్….

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యంపై దృష్టి సారిస్తోంది. తెలంగాణ ఏర్పడి ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో యువతులకు సరైన ఆహారం లేక నానా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందుకోసం చిన్నప్పటి నుంచి మంచి ఆహారం తీసుకుంటే వ్యాధులు రావని భావిస్తోంది. దీనికి తోడు మారుతున్న జీవనశైలి, ఆపై ఆహారం అలవాట్లు. ఇవన్నీ టీనేజీ యువతులపై ప్రభావం కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యువతల కోసం కొత్త స్కీమ్ తీసుకురావాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్.

 

యువతులకు కొత్త స్కీమ్

 

తెలంగాణలో టీనేజీ గాళ్స్ ఐరన్ లోపం, రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని నివారించేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. 14 నుంచి 18 ఏళ్లు మధ్య యువతులు ఐరన్, రక్తహీనత సమస్యలతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు మిల్లెట్ పట్టీలు, పల్లి పట్టీలు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. నెలకు 15 ప్యాకెట్ల చొప్పున రెండు రకాలను ప్రతీ టీనేజ్ యువతికి ఇవ్వాలన్నది ఇందులో కీలకమైంది.

 

వీటిని అంగన్ వాడీల ద్వారా పంపిణీ చేయాలని భావిస్తోంది. దీనికి ‘ఇందిరమ్మ అమృతం’ అనే పేరును పరిశీలిస్తోంది. ఈ పేరుతో రేపో మాపో నిర్ణయం తీసుకోనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తొలి దశ కింద ఫైలట్ ప్రాజెక్టుగా కొత్తగూడెం, అసిఫాబాద్, ములుగు జిల్లాలను ఎంపిక చేశారట అధికారులు. ఈ జిల్లాల్లో అన్నిగ్రామాల్లో టీనేజ్ యువతులను అంగన్ వాడీ టీచర్, ఆయాలు యువతులకు పంపిణీ చేయనున్నారు.

 

జూన్ నుంచి మొదలు?

 

ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఆపై కాంట్రాక్టర్‌‌‌‌ను ఎంపిక చేసింది. ఆరో నెల అంటే జూన్ నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మూడు జిల్లాలు సక్సెస్ అయితే.. అన్ని జిల్లాల్లో మిల్లెట్, పల్లి పట్టీలు పంపిణీ చేయాలని భావిస్తోంది. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య లక్ష్మి పథకం అమలు చేస్తోంది. దాని కింద బియ్యం, పప్పు, 200 మిల్లీ లీటర్ల పాలు, నెలకు 30 గుడ్లు అందిస్తుంది.

 

మిల్లెట్ పట్టీలు, పల్లి పట్టీలు పంపిణీ చేసే సమయంలో సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలపై వివరించనున్నారు. అనుకోని ఘటనలు ఎదురైనప్పుడు ఏ విధంగా ఎదుర్కొవాలి అన్నదానిపై అవగాహన కల్పించనున్నారు. కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే దీన్ని మంచి స్కీమ్‌గా చెబుతున్నారు.

 

జంక్ ఫుడ్స్ వల్లే

 

మారుతున్న జీవనశైలి, ఆపై ఆహారపు అలవాట్లతో చాలా మంది యువతులు రక్తహీనత, ఐరన్ లోపంతో ఇబ్బందిపడుతున్నారు. టీనేజ్‌లో శరీరంలో వచ్చే మార్పుల వల్ల రక్తం, ఐరన్ అవసరం ఎంతైనా ఉంటుంది. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం రకరకాల సమస్యలు వెంటాడుతున్నాయి.

 

పండ్లు, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తక్కువగా తీసుకోవడం రకరకాల సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే యువతులకు గుడ్‌ న్యూస్.