TELANGANA

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు సర్వం సిద్ధం..?

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టు(పార్ట్-బి)కు సంబంధించి డీపీఆర్ రెడీ అయ్యింది. రేవంత్ మంత్రివర్గం వచ్చే వారం ఆమోదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు మేడ్చల్‌, జూబ్లీ బస్ స్టేషన్ నుండి షామిర్‌పేటకు విస్తరించనుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి అనుసంధానించే మెట్రో కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ను కేబినెట్ ఆమోదించనుంది.

 

ఈ ఏడాది జనవరి ఒకటిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును నూతన సంవత్సర గిఫ్ట్‌గా ప్రకటించారు. ప్యారడైజ్ నుండి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల పొడవు, జేబీఎస్ నుండి షామీర్‌పేట వరకు 22 కిలోమీటర్ల పొడవు గల మెట్రో మార్గాలకు సంబంధించి డీపీఆర్‌లను సిద్ధం చేయాలని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్-HAMLను ఆదేశించారు ఆయన. మూడో కారిడార్‌గా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి అనుసంధానించ నున్నారు. దాదాపు 40 కిలోమీటర్లు పొడవు ఉంటుంది.

 

ఎక్కడ నుంచి ఎక్కడ వరకు?

 

జేబీఎస్-మేడ్చల్ మెట్రో రైలు తాడ్‌బండ్, బోయిన్‌పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి మీదుగా వెళ్లనుంది. ఇక జేబీఎస్-షామీర్‌పేట్ మెట్రో రైలు విక్రమ్‌పురి,కార్ఖానా, అల్వాల్, బోలారం మీదుగా వెళ్తుంది. ఏప్రిల్ 2 లోపు డీపీఆర్‌లను పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారు. కాకపోతే అనుకున్న సమయానికి కాకపోయినా, డీపీఆర్‌లను ఇప్పుడు ఓకే అయ్యింది.

 

వచ్చేవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు. ఫేజ్-1 మాదిరిగానే ఫేజ్-2 కూడా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేయబడుతుంది. ప్రతిపాదించిన కారిడార్‌లలో వినూత్నమైన డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ నిర్మాణాలు, బ్లెండింగ్ మెట్రో వయాడక్ట్‌లు, ఎలివేటెడ్ రోడ్‌లు ఉండవచ్చు.

 

సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్‌ మధ్య ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి హెచ్ఎండీఏ-HMDA పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం-PPP మోడల్ కింద రెండు ఎలివేటెడ్ కారిడార్‌లను ప్రతిపాదించింది. మొదట ప్యారడైజ్ జంక్షన్ నుండి షామిర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 11.12 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ ఉండనుంది. సెకండ్ కారిడార్ 5.32 కిలోమీటర్లు మాత్రమే. ప్యారడైజ్ జంక్షన్‌ను డైరీ ఫామ్ రోడ్‌తో NH-44 కలుపుతుంది. ఈ ఎలివేటెడ్ కారిడార్లు ప్రతిపాదిత మెట్రో లైన్‌లతో అనుసంధానించబడనున్నాయి.

 

బోర్డు ఆమోదం తర్వాత

 

మెట్రో రైలు రెండోదశ-బి ప్రాజెక్ట్‌ నివేదిక రెడీ అయ్యింది. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌ బోర్డు ఆమోదం మిగిలివుంది. బోర్డులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐదు విభాగాల నుంచి డైరెక్టర్లు, HAML మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు. పురపాలక-పట్టణాభివృద్ధి, ఆర్థిక, పరిశ్రమలు, ఐటీ, ఆర్ అండ్ బీ కార్యదర్శులు ఉండనున్నారు. బోర్డు ఆమోదం తర్వాత రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. డీపీఆర్‌పై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి ఆమోదించిన తరువాత దాన్ని కేంద్రానికి పంపనున్నారు.

 

సిద్ధమైన డీపీఆర్‌ను తొలుత హెచ్‌ఏఎంఎల్‌ బోర్డు ఆమోదం తెలపాలి. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎండీతో పాటు ఐదుగురు డైరెక్టర్లు ఉన్నారు. పురపాలక-పట్టణాభివృద్ధి, ఆర్థిక, పరిశ్రమలు, ఐటీ శాఖ, ఆర్‌ అండ్‌ బీ కార్యదర్శులు ఉంటారు. అలాగే హెచ్‌ఎండీఏ కమిషనర్‌ ఉంటారు.

 

జపాన్‌ తరహాలో సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు జేబీఎస్‌ వద్ద 30 ఎకరాల్లో ప్రపంచస్థాయి మెట్రో హబ్‌ను అభివృద్ధి చేయాలన్నది ఆలోచన. ఇటీవల జపాన్‌ వెళ్లిన సీఎం, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి అక్కడి అనుభవాలను మెట్రో హబ్‌కు జోడించేలా రూపకల్పనపై ఫోకస్ చేశారు. జపాన్‌లో బుల్లెట్‌ రైలు, మెట్రో, రైలు సదుపాయాలు ఉన్నాయి. అవన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానంగా ఒక దాని నుంచి మరొక దానిలోకి సులభంగా మారొచ్చు.