ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్తో సరిహద్దుల్లో అనిశ్చిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం రక్షణ రంగంలో అప్రమత్తమైంది. బ్రహ్మోస్, ఆకాష్ వంటి కీలక క్షిపణుల తయారీతో పాటు వాటికి అవసరమైన విడిభాగాల ఉత్పత్తిని వేగవంతం చేయాలని సంబంధిత తయారీదారులకు ఆదేశాలు జారీ చేసింది. యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు కాకుండా, శాంతి నెలకొన్నప్పుడే సన్నద్ధత కీలకమని కేంద్రం భావిస్తోంది.
క్షిపణి తయారీ కేంద్రంగా హైదరాబాద్ ప్రాధాన్యత
భారతదేశపు “మిస్సైల్ క్యాపిటల్”గా పేరుగాంచిన హైదరాబాద్, అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ రక్షణ తయారీ సంస్థలకు నిలయంగా ఉంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, అదానీ ఎల్బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (KRAS), ఎంటీఏఆర్ టెక్నాలజీస్, ఆస్ట్రా మైక్రోవేవ్, అనంత్ టెక్నాలజీస్, రఘు వంశీ, జెన్ టెక్నాలజీస్, ఎస్ఈసీ ఇండస్ట్రీస్ వంటి అనేక ప్రైవేట్ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. క్షిపణి వ్యవస్థలకు కీలకమైన సబ్-సిస్టమ్లను ఈ సంస్థలు సరఫరా చేస్తాయి.
ఉత్పత్తి వేగవంతంపై తయారీదారుల స్పందన
ఆకాష్ ఇంకాబ్రహ్మోస్ క్షిపణులకు కీలక విడిభాగాలను సరఫరా చేసే హైదరాబాద్లోని ఒక సంస్థ ప్రమోటర్ మాట్లాడుతూ, డెలివరీలను వేగవంతం చేసేందుకుగాను వారాంతాల్లో కూడా పనిచేయమని తమను కోరినట్లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్కు ముందు రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) నుండి క్షిపణుల కోసం పెద్ద ఎత్తున అత్యవసర కొనుగోలు ఆర్డర్ వచ్చిందని, అయితే ఆపరేషన్ ప్రారంభమయ్యాక ప్రభుత్వం నిరంతరం సంప్రదిస్తూ వారానికోసారి డెలివరీలను కోరుతోందని మరో సంస్థ ప్రమోటర్ వెల్లడించారు. వీరు వ్యూహాత్మక క్షిపణులు, యూఏవీల నుండి ప్రయోగించే ఖచ్చితత్వంతో కూడిన క్షిపణుల కోసం ప్రొపల్షన్ సిస్టమ్లను సరఫరా చేస్తున్నారు.
డ్రోన్ టెక్నాలజీపై కేంద్ర దృష్టి
క్షిపణులతో పాటు డ్రోన్,యాంటీ-డ్రోన్ టెక్నాలజీ కంపెనీలతో కూడా రక్షణశాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. సామర్థ్యాలను పెంచడానికి అన్ని కంపెనీలతో కలిసి పనిచేస్తున్నారని ఒక డ్రోన్ టెక్ కంపెనీ వ్యవస్థాపకుడు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కీలక రక్షణ మరియు పోర్ట్-సంబంధిత మౌలిక సదుపాయాల రక్షణ కోసం వీరి యాంటీ-డ్రోన్ సిస్టమ్లను ఉపయోగించారు. అన్ని విభాగాల కమాండర్లకు నేరుగా పరికరాలు కొనుగోలు చేసే హక్కులు ఇచ్చారని, రాబోయే రెండు, మూడు నెలల్లో పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు.
ఉపరితలం నుండి ముప్పు – సన్నద్ధతలో వేగం
ఆపరేషన్ సిందూర్ అనుభవాల నేపథ్యంలో, నిజమైన దాడులు భూమి నుండి కాకుండా ఎక్కువగా ఉపరితలం నుండి వచ్చే అవకాశం ఉందని స్పష్టమైందని,అందుకే ప్రభుత్వం లొసుగులను పూడ్చాలని భావిస్తోందని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు పేర్కొన్నారు. సాధారణంగా ఆర్డర్లను పూర్తి చేయడానికి ఆరు నెలల నుండి ఒక సంవత్సరం పట్టేదని,అయితే ఇప్పుడు ప్రభుత్వం వాటిని కొద్ది నెలల్లోనే కోరుకుంటోందని ఆయన తెలిపారు.
బాలాకోట్ దాడుల్లో హైదరాబాదీ క్షిపణులు
యాదృచ్చికంగా, ఫిబ్రవరి 2019లో బాలాకోట్ వైమానిక దాడుల్లో ఉపయోగించిన స్పైస్ 2000 క్షిపణులను హైదరాబాద్లోని కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (KRAS) లోనే తయారు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆపరేషన్ సిందూర్ కోసం కూడా స్పేస్ క్షిపణులను సిద్ధం చేసినప్పటికీ, భారత వైమానిక దళం చివరకు స్కాల్ప్ మరియు హామర్ ఎయిర్-టు-సర్ఫేస్ క్షిపణులను ఉపయోగించింది. దేశ రక్షణ సన్నద్ధతలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.