ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అధికారులు కాసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. మూడు రోజుల పాటు ప్రశ్నించిన సిట్ బృందం.. వీరి ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది. ఈ రోజు మార్నింగ్ నుంచి ఏకధాటిగా 9 గంటల పాటు సిట్ ఇద్దరినీ విచారించిన విషయం తెలిసిందే.
రేపు వీరి ఇద్దరినీ ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,200 కోట్ల లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం కార్యాలయ కార్యదర్శి, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రం వరకు వారిని అరెస్ట్ చేయకూడదు అనే ఆదేశాలు ఉండటంతో.. అధికారులు ఈ మూడు రోజులు వారిని సిట్ ఆఫీసులో ఏకధాటిగా విచారించారు. అయితే, సాయంత్రం సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో అధికారులు వారి ఇద్దరినీ అరెస్ట్ చేశారు.