వార్తలు చెప్పే వాళ్ల మీదే ఇప్పుడు వార్తలే వస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఘర్షణాత్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లోని మహా టీవీ కార్యాలయం వద్ద ఊహించని ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావిస్తూ ప్రసారం చేసిన కథనాలకు నిరసనగా BRS కార్యకర్తలు రోడ్డెక్కారు. కానీ అది నిరసనతో ఆగకుండా.. ఏకంగా ఆఫీసులోకి జొరబడి, అద్దాలు పగులగొట్టారు, కార్లను ధ్వంసం చేశారు, స్టూడియోకు హాని కలిగించారు. కొన్ని నిమిషాల్లోనే ఆ ప్రాంతం సంగ్రామ భూమిగా మారిపోయింది.
మీడియా కార్యాలయం టార్గెట్..
కథనాలపై అభ్యంతరం ఉన్నా అది చర్చలకే పరిమితం కావాలి కాని, కొందరు చర్యలకు దిగడం ఆందోళన కలిగించే విషయమని మీడియా ప్రతినిధులు అంటున్నారు. మహా టీవీ కార్యాలయంలోని అద్దాలు పగులగొట్టడం, పార్కింగ్లో నిలిపి ఉంచిన వాహనాల మీద రాళ్లు విసరడం మొదలయ్యాయి. సిబ్బంది గబగబా పరుగు తీసే పరిస్థితి. స్టూడియోలోని కెమెరాలు, లైటింగ్ పరికరాలు ధ్వంసమయ్యాయి. ఘటన తీవ్రత ఇంతలా ఉందంటే, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందే ఒక్కసారిగా ఏమి జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయామని స్థానికులు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్.. ఆరోపణలు, అసహనం
ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బాగా హీటెక్కింది. అనేక మీడియా సంస్థలు ఈ అంశాన్ని పట్టు పట్టి కథనాలు ప్రసారం చేస్తున్నాయి. మహా టీవీ కూడా ఇదే తరహాలో న్యూస్ టెలికాస్ట్ చేసినట్టు సమాచారం. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్ పేరు రావడంతో BRS వర్గాలు తీవ్రంగా స్పందించాయి. కేటీఆర్ ఇప్పటికే ఈ ఆరోపణలను ఖండించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై లీగల్ నోటీసులు పంపించినట్టు సమాచారం. అయినా మహా టీవీ ప్రసారించిన విషయంపై కార్యకర్తలు ఆగ్రహాన్ని చట్ట వ్యతిరేకంగా ప్రదర్శించారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒక రాజకీయ ఆగ్రహం.. మీడియా స్వేచ్ఛకు దెబ్బ
ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు, మీడియా ఆఫీసులోకి ప్రవేశించి, జాగ్రత్తలకే అవకాశం ఇవ్వకుండా విధ్వంసం చేయడం మామూలు విషయం కాదు. ఇది కేవలం ఒక ఛానల్ ప్రసారం చేసిన వార్తపై కలిగిన అసహనమే కాదు, స్వేచ్ఛైన అభిప్రాయ వ్యక్తీకరణను అణగదొక్కే ప్రయత్నం కూడా అంటున్నారు జర్నలిస్టులు. ఈ ఘటనపై జర్నలిస్టుల సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. చట్టం ప్రకారం ఎదురు చెప్పొచ్చు, కోర్టులో కేసు వేసుకోవచ్చు. కానీ హింసకి దిగడం దారుణం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు రంగంలోకి.. కేసు నమోదు
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటన స్థలానికి చేరుకున్నారు. కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అల్లర్లు రెచ్చగొట్టిన వారిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. అలాగే, మీడియా సంస్థ నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందిన తర్వాత మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
ఇది ప్రజాస్వామ్యమా?
సాధారణ పౌరుల నుంచి, రాజకీయ విశ్లేషకుల వరకూ.. ఇందుకు స్పందన తారస్థాయిలో ఉంది. ఒక వార్త ఇష్టం లేకపోతే ఆగ్రహంతో పగ తీయాలంటే అది ప్రజాస్వామ్యానికి భ్రష్టుపట్టిన సూచన” అంటున్నారు నెటిజన్లు. “మీడియా బలంగా ఉండకపోతే ప్రజలకు నిజం ఎలా తెలుస్తుంది? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ ఘటన రెండు విషయాలు స్పష్టంగా చెబుతోంది. మొదటిది.. రాజకీయాలలో అసహనం ఎంత మోతాదులో పెరిగిందో. రెండోది.. మీడియా స్వేచ్ఛ ఇంకా ఎంత పోరాడవలసినదో. మీడియా తప్పు చేస్తే కోర్టు ఉంది, న్యాయవ్యవస్థ ఉంది. కానీ హింసను సమర్థించడం ఎవరూ చేయలేరు. ఇప్పటికైనా నేతలు, కార్యకర్తలు తమను తాము సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం అర్థం.. వాదనలు, చర్చలు, కాకుండా దాడులు కాదు.
కేటీఆర్ హెచ్చరిక..
టెలిఫోన్ టాపింగ్ అంశంలో తనపై, పార్టీపై వాస్తవాలకు విరుద్ధంగా దుష్ప్రచారం చేస్తున్న వారిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టిగానే స్పందించారు. ఇలాంటి అబద్ధాలు, అసత్యాలు, దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తూ ఎవరు ఉంటే వారిపై చట్టపరంగా చర్యలు తప్పవు అంటూ ఆయన హెచ్చరించారు.
కేటీఆర్ మాటల్లో.. కొంతమంది వ్యక్తులు మీడియా ముసుగులో కనిపిస్తూ, కావాలనే తప్పుడు వార్తలతో పబ్లిక్ను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం భూతద్దంలో చూపే భ్రమ కాదు.. మా పార్టీపై, నా కుటుంబంపై నేరుగా దాడి చేయాలనే ముఠా పద్దతిలో జరుగుతున్న కుట్ర. కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది వ్యక్తులు జట్టుగా మారి, దుష్ప్రచార యంత్రంగా పనిచేస్తున్నారు. వాళ్లను కూడా చట్టపరంగా సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు.
గత కొన్ని నెలలుగా విలేకరుల వేషం వేసుకుని కొంతమంది యజమానులు నా పైన వ్యక్తిగతంగా విషం చిమ్ముతున్నారన్నారు. మా బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని తప్పుడు కథనాలు, అభ్యంతరకర వ్యాఖ్యలతో దూషిస్తున్నారని, ఇలాంటి నీచమైన అభిప్రాయాలు నాపైన ప్రభావం చూపవన్నారు. కానీ మా కుటుంబ సభ్యులపై మాత్రం తీవ్ర మానసిక ప్రభావం చూపిస్తున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియా స్వేచ్ఛ అనేది ఒక హద్దుల్లో ఉండాలి. కక్ష సాధింపు కోసం వాడుకునే ఆయుధం కాకూడదు. మా శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణులు ఇవి చూసి బాధపడుతున్నారన్నది నాకు తెలిసిన విషయమే. అందుకే ఇకపై ఒక్కొక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అంటూ ఆయన స్పష్టం చేశారు.