బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేసేందుకు తనతో రాయబారం నడిపే ప్రయత్నం చేశారంటూ కేటీఆర్ గురించి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోలేదని, మరికొన్ని సంచలనాలు మిగిలే ఉన్నాయని చెప్పారాయన. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటపెడతానన్నారు. నెక్స్ట్ ఎపిసోడ్స్ మిగిలే ఉన్నాయని హింట్ ఇచ్చారు సీఎం రమేష్
బతిమిలాడారు..
“మేం ఇబ్బందుల్లో ఉన్నాం, మా నాన్న ఆరోగ్యం బాలేదు, మధనపడిపోతున్నారు, నువ్వు సాయం చెయ్యి, లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ వచ్చేలా చూడు. అవసరమైతే బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేస్తాం, లేదా తెలంగాణలో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది.” కేటీఆర్ తనతో మాట్లాడిన మాటలు ఇవేనంటూ కుండబద్దలు కొట్టారు సీఎం రమేష్. లిక్కర్ స్కామ్ లో కవిత జైలులో ఉన్న సమయంలో ఆయన బీజేపీతో మంతనాలు జరిపేందుకు ప్రయత్నించారని, అందులో భాగంగానే తనను కలిశారని చెప్పారు. అయితే బీజేపీ అధిష్టానం ఆ ప్రతిపాదనను తిరస్కరించిందని తెలంగాణలో సొంతంగా ఎదుగుతామని చెప్పిందని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, ప్రజలు బీఆర్ఎస్ నేతల నిజస్వరూపం తెలుసుకుని వారిని ఓడించారని, ఇకపై కూడా ప్రజలు ఆ పార్టీని నమ్మరనేది బీజేపీ అదిష్టానం అభిప్రాయం అని చెప్పారు సీఎం రమేష్.
దమ్ముంటే కాదని చెప్పు…
కవిత జైలులో ఉన్నప్పుడు ఢిల్లీ వచ్చిన కేటీఆర్ తనని కలిశారో లేదో ఆయనే చెప్పాలని సవాల్ విసిరారు సీఎం రమేష్. కావాలంటే తాను సీసీ కెమెరాల వీడియోలన్నీ బయటపెడతానన్నారు. తనను కలవలేదని, తనతో బీఆర్ఎస్ విలీనం గురించి మాట్లాడలేదని కేటీఆర్ చెప్పగలడా అని అడిగారు. ఈ విషయంపై ఎక్కడ చర్చించడానికైనా తాను సిద్ధమేనన్నారు సీఎం రమేష్.
మీకో న్యాయం.. ఇతరులకో న్యాయమా?
మీరైతే ఢిల్లీలో లిక్కర్ వ్యాపారాలు చేసుకోవచ్చా, ఇతరులెవరూ తెలంగాణలో కాంట్రాక్ట్ లు చేయకూడదా అని సూటిగా ప్రశ్నించారు సీఎం రమేష్. 9 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కాంట్రాక్ట్ లన్నీ ఏ ప్రాంతం వారికి ఇచ్చిందో అందరికీ తెలుసన్నారు. అమెరికాలో బీఆర్ఎస్ సభలు పెట్టుకోవచ్చు కానీ, హైదరాబాద్ లో చంద్రబాబు అరెస్ట్ కి వ్యతిరేకంగా నిరసనలు తెలపకూడదా అని ప్రశ్నించారు. కేవలం జగన్ మెప్పు కోసమే అప్పుడు కేటీఆర్ నిరసనలకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేశారు. కమ్మ సామాజికవర్గం, రెడ్డి సామాజిక వర్గం నేతలపై కూడా కేటీఆర్ నీఛంగా మాట్లాడేవారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఆ రెండు సామాజిక వర్గాల నేతలు తమని మోసం చేశారని, తమకు జగన్ ఒక్కడే చాలని కేటీఆర్ చెప్పినట్టు గుర్తు చేశారు సీఎం రమేష్.
మొత్తమ్మీద సీఎం రమేష్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ కి తీవ్రంగా నష్టం చేకూర్చాయని చెప్పాలి. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదనలను గతంలో కవిత కూడా తన లేఖ ద్వారా ధృవీకరించారు. తాజాగా సీఎం రమేష్ వ్యాఖ్యలతో ఆ ప్రతిపాదనలు నిజమేనని తేలిపోయాయి. మరి ముందు ముందు ఆయన బయటపెట్టే విషయాలు ఇంకెంత సంచలనంగా ఉంటాయో చూడాలి.