రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల పరిస్థితిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకులాలు నరక కూపాలుగా మారాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్, పాముకాట్లు, విష జ్వరాల బారిన పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు స్పందిస్తూ.. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. కల్తీ ఆహారం పెడితే జైలుకేనని చేసిన హెచ్చరికలు గాలి మాటలయ్యాయి” అని ఎద్దేవా చేశారు. గురుకులాల్లో పనిచేస్తున్న దాదాపు 2500 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి గత రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం దారుణమని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఆడంబరపు ప్రకటనలు ఇచ్చే బదులు, వారికి సకాలంలో జీతాలు చెల్లించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో ప్రస్తుత పరిస్థితిని పోలుస్తూ, కేసీఆర్ హయాంలో గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని హరీశ్ రావు గుర్తుచేశారు. “నాడు కేసీఆర్ గురుకులాల సంఖ్యను 294 నుంచి 1024కి, విద్యార్థుల సంఖ్యను లక్షా 90 వేల నుంచి ఆరున్నర లక్షలకు పెంచి నాణ్యమైన విద్యను అందించారు. విద్యపై పెట్టే ఖర్చును ఆయన పెట్టుబడిగా భావించారు. కానీ, కాంగ్రెస్ 22 నెలల పాలనలో గురుకులాల ఖ్యాతి అధఃపాతాళానికి పడిపోయింది” అని ఆరోపించారు.
ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి గాడితప్పిన గురుకుల వ్యవస్థను చక్కదిద్దాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించడంతో పాటు, పెండింగ్లో ఉన్న సిబ్బంది జీతాలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.