తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో (USISPF) పాల్గొని, రాష్ట్రం యొక్క ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ను ఆవిష్కరించారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రపంచ పారిశ్రామికవేత్తలకు గట్టి భరోసా ఇస్తూ, చైనా ప్లస్ వన్ (China Plus One) మోడల్కు ప్రపంచవ్యాప్త సమాధానం తెలంగాణనే అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, భద్రత, భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానమని ఆయన స్పష్టం చేశారు.
దేశంలోనే అత్యధిక యువత, వేగవంతమైన వృద్ధి రేటుతో తెలంగాణ దూసుకుపోతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. గత 35 ఏళ్లుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, పెట్టుబడులకు సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, ఈ విషయంలో రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం ఉందని ఆయన పారిశ్రామికవేత్తలకు గుర్తు చేశారు. మహిళా సాధికారత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, అత్యున్నత జీవన ప్రమాణాలతో హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమే తన ప్రథమ ప్రాధాన్యత అని సీఎం వివరించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రతిపాదనలు చేశారు. 30 వేల ఎకరాల్లో నిర్మించతలపెట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ దేశంలోనే ఒక నూతన నగరంగా నిలుస్తుందని తెలిపారు. అంతేకాకుండా, హైదరాబాద్లో రోడ్లకు నేతల పేర్లు పెట్టే సంప్రదాయాన్ని మార్చి, గూగుల్, మెటా, టీసీఎస్ వంటి గ్లోబల్ కంపెనీల పేర్లను పెడతామని ఆయన చేసిన ప్రకటన సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఎం విజన్పై సిస్కో మాజీ సీఈఓ జాన్ చాంబర్స్ ప్రశంసలు కురిపించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరిగే ‘తెలంగాణ రైజింగ్’ గ్లోబల్ సమ్మిట్కు హాజరవుతామని USISPF అధ్యక్షుడు డా. ముఖేష్ ఆఘి తెలిపారు.

