TELANGANA

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఉత్కంఠ..! రేపే కోర్టు తీర్పు..

మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నమిత శర్మల భవితవ్యంపై ఉప్పరపల్లి కోర్టులో కీలక వాదనలు ముగిశాయి. నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్.. తమకు బెయిల్ మంజూరు చేయాలని నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ధర్మాసనం తీర్పును రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం వెలువడనున్న ఈ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

పోలీసుల తరపు న్యాయవాది కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో లోతైన విచారణ అవసరమని వారు స్పష్టం చేశారు. డ్రగ్ పెడ్లర్లతో రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలు.. ఫామ్ హౌస్ వేదికగా జరిగిన పార్టీల వెనుక ఉన్న అసలు రహస్యాలను బయటకు తీయాల్సి ఉందని కోరారు. ముఖ్యంగా ఈ కేసులో భారీగా జరిగిన ఆర్థిక లావాదేవీలపై నిందితులను ముఖాముఖి విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ నెట్‌వర్క్ మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి నిందితులను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున ఇప్పుడు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

మరోవైపు నిందితుల తరపు న్యాయవాదులు పోలీసుల వాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే పోలీసుల విచారణ పూర్తయిందని.. మళ్లీ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. రోహిత్ రెడ్డి ప్రజా ప్రతినిధిగా ఉన్నారని.. చట్టానికి సహకరిస్తారని కోర్టుకు వివరించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛను దృష్టిలో ఉంచుకుని తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు కావాలనే దర్యాప్తును జాప్యం చేస్తున్నారని.. నిందితులపై మోపిన సెక్షన్లు చెల్లవని వాదనలు వినిపించారు. రెండు వర్గాల వాదనలు విన్న ఉప్పరపల్లి కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.

 

ఈ కేసు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఫామ్ హౌస్ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు.. డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుండి జరిగిందనే అంశాలపై పోలీసులు ఇప్పటికే కొంత సమాచారం సేకరించారు. అయితే ప్రధాన నిందితులను విచారిస్తే మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రేపు కోర్టు కస్టడీకి అనుమతిస్తుందా లేక బెయిల్ మంజూరు చేస్తుందా అన్నది కీలకంగా మారింది. పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు.. నిందితుల తరపు వాదనలను పరిగణనలోకి తీసుకుని కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.