AP

అనకాపల్లిలో రూ.5,400 కోట్ల రీన్యూ సోలార్ ప్లాంట్… ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగంలో మరో భారీ పెట్టుబడికి రంగం సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో సుమారు రూ. 5,400 కోట్ల వ్యయంతో సోలార్ ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ రీన్యూ ఎనర్జీ గ్లోబల్ (ReNew) ముందుకొచ్చింది. ఈ మెగా ప్రాజెక్టుకు ఏప్రిల్ 23న ముఖ్యమంత్రి చంద్రబాబు, రీన్యూ సీఈఓ సుమంత్ సిన్హాతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు.

 

ఈ ప్రాజెక్టులో భాగంగా రూ. 4,200 కోట్లతో 6 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఇంగోట్-వేఫర్ తయారీ ప్లాంట్‌ను, మరో రూ. 1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌ను రీన్యూ నిర్మించనుంది. కేవలం 24 నెలల రికార్డు సమయంలోనే ఈ ప్లాంట్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,100 మందికి పైగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

 

సోలార్ పీవీ మాడ్యూల్స్, సెల్స్ తయారీకి అత్యంత కీలకమైన ఇంగోట్స్, వేఫర్లను దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా సోలార్ సరఫరా రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ ప్లాంట్ దోహదపడనుంది. 2015 నుంచి రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న రీన్యూ, ఇప్పటికే అనంతపురం జిల్లాలో రూ. 22,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్‌ను నిర్మిస్తోంది. తాజా ప్రాజెక్టుతో కలిపి రాష్ట్రంలో మొత్తం రూ. 82,000 కోట్ల పెట్టుబడుల దిశగా రీన్యూ అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టుతో అనకాపల్లి పారిశ్రామిక ముఖచిత్రం మారనుందని నిపుణులు భావిస్తున్నారు.