TELANGANA

రేషన్ ఫాపుల్లో ఇకపై అవి కూడా పంపీణీ..?

రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం భరోసా ఇస్తుంది. మొక్కజొన్న, జొన్న పంటలకు మద్దతు ధర కల్పించడమే కాకుండా, సేకరించిన ధాన్యాన్ని మార్కెట్ ధర కంటే తక్కవ ధరకు రేషన్ దుకాణాల ద్వారా నేరుగా పేదల చెంతకు చేర్చేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఈ పంటలను బహిరంగ మార్కెట్‌లో వేలం వేసి మధ్యవర్తులకు లాభం చేకూర్చకుండా, సివిల్ సప్లై శాఖ ద్వారా రేషన్ షాపుల లో పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించి అందుబాటులోకి తీసుకురాబోతుంది.

 

మార్కెట్ ధర కంటే తక్కువ..

పంట పండించిన రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో మొక్కజొన్న, జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ప్రజలకు ఈ పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలోనే కిలో ధర సైతం నిర్ణయించనున్నారు.

 

ప్యాకింగ్ చేయించి నేరుగా..

సాధారణంగా ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో వేలం వేస్తుంది. దీన్ని అదునుగా తీసుకుని మధ్యవర్తులు తక్కువ ధరకే దక్కించుకుని లాభపడుతుంటారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, సేకరించిన ధాన్యాన్ని ప్యాకింగ్ చేయించి నేరుగా ప్రజలకు తక్కువ ధరకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. “ధాన్యం కేవలం మార్కెట్ సరుకుగా మిగిలిపోకూడదు. అది పేదవాడి ఆకలి తీర్చి, పౌష్టికాహారంగా మారాలి” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

 

సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ రంగం..

ప్రభుత్వ నిర్ణయం వల్ల కేవలం సామాన్య ప్రజలకే కాకుండా, సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించేలా మొక్కజొన్న, జొన్నల సరఫరాకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ రంగాన్ని ఆదుకునేందుకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు పౌల్ర్టీ రైతులకు అవసరమైన మేరకు కూడా సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం పట్ల రైతులు, సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.