AP

గజరాజులకు ‘ఆధార్’.. ఏపీ అటవీశాఖ వినూత్న ముందడుగు..

ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ గజరాజుల రక్షణ కోసం ఒక వినూత్నమైన అడుగు వేసింది. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రంలో ఉన్న ఆరు కుంకీ ఏనుగులకు ప్రత్యేకంగా ‘ఆధార్’ తరహా గుర్తింపు కార్డులను ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కుంకీ ఏనుగులు అంటే అడవి ఏనుగులను దారికి తెచ్చేందుకు, ఇతర ఆపరేషన్లలో అటవీశాఖకు సాయపడే శిక్షణ పొందిన ఏనుగులు. వీటి రక్షణ, ఆరోగ్యం విషయంలో మరింత పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఆ ఆరు ఏనుగులకు డీఎన్‌ఏ (DNA) పరీక్షలు నిర్వహించారు. వీటి నమూనాలను విశ్లేషణ కోసం డెహ్రాడూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. అక్కడ నుంచి రిపోర్టులు రాగానే, ఒక్కో ఏనుగుకు సంబంధించిన పూర్తి జన్యు సమాచారం, దాని వయస్సు, ఆరోగ్య స్థితిగతులు వంటి వివరాలతో కూడిన స్మార్ట్ గుర్తింపు కార్డులను జారీ చేస్తారు.

 

ఈ గుర్తింపు కార్డుల వల్ల భవిష్యత్తులో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏనుగులకు ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు వాటికి మెరుగైన వైద్యం అందించడానికి, జన్యుపరమైన సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి ఈ డేటా ఎంతో కీలకం అవుతుంది. అంతేకాకుండా, ఏనుగుల తరలింపు లేదా ఇతర అటవీ ప్రాంతాల్లో వాటిని వినియోగించినప్పుడు వాటి పూర్తి చరిత్ర అధికారుల దగ్గర అందుబాటులో ఉంటుంది. సాంకేతికతను వన్యప్రాణుల సంరక్షణకు వాడుకోవడంలో ఏపీ అటవీశాఖ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం.