తనను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదని ప్రముఖ యాంకర్, వైసీపీ నాయకురాలు శ్యామల అన్నారు. శ్యామలకు కౌంట్డౌన్ మొదలైందని కొంతమంది మాట్లాడుతున్నారని, కానీ వారికి ఒక్కటే సమాధానం చెప్పదలుచుకున్నానని అన్నారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని వారు తెలుసుకోవాలని అన్నారు. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం కోసమే జగనన్న ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు.
ఆ ప్రేమ ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని అన్నారు. తన ప్రయాణం ఎవరి కరుణతోనో ప్రారంభం కాలేదని ఆమె అన్నారు. తన స్వరం, నిబద్ధత, జగనన్న పక్షాన నిలబడే ధైర్యం, జగన్ అన్నకు ఉన్న నమ్మకం.. ఇవే తన బలమని స్పష్టం చేశారు. తాడేపల్లిలో ‘పొగ’ కనిపిస్తోందని కథలు రాసేవాళ్లు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలని, పొగ ఎక్కువ రావడమంటే కొందరిలో కడుపుమంట ఎక్కువ అయినట్లేనని విమర్శించారు.
తనను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే అది పుకార్లతోనో, కుట్రలతోనో జరిగే పని కాదని అన్నారు. నిత్యం తనపై అవాకులు చెవాకులు రాసేవాళ్లు ఉంటారని, కానీ తాను మాత్రం ప్రతిరోజు జగన్ కలలు గన్న ఏపీ దిశగా అడుగులు వేస్తున్నానని పేర్కొన్నారు. తనను ఎవరైనా సైలెంట్ చేయాలనుకుంటే, తన గళం మరింత గట్టిగా మారుతుందని శ్యామల తెలిపారు.
కొందరు చెబుతున్నట్లు ఇది తన కౌంట్ డౌన్ కాదని, తన స్వరానికి, పోరాటానికి మరింత బలమని అన్నారు. తనను తగ్గించాలనుకునే వాళ్లు చాలామంది ఉంటారని, కానీ తనను నిలబెట్టేది మాత్రం ఒక్క జగన్ అనే నమ్మకం, కోట్లాది ప్రజల ప్రేమ మాత్రమేనని శ్యామల అన్నారు

