TELANGANA

బండి భగీరథ్ అంశంపై డీజీపీని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి..

కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రశ్నించారు. ఈ కేసులో వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. కేసులో సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో సిబ్బంది బిజీగా ఉన్నారని డీజీపీ సమాధానం చెప్పారు. కేసు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు.

 

బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు అంశంపై తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. సీపీ నుంచి కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి పూర్తి వివరాలు తెప్పించుకున్నారు. విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు.

 

కాగా, తన కుమార్తెను బండి భగీరథ్ వేధిస్తున్నారంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు సెక్షన్ 11 రెడ్‌విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్, బీఎన్ఎస్ 74, 75 సెక్షన్ల క్రింద శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. మరోవైపు, బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు డబ్బుల కోసం తనను బెదిరిస్తున్నారని శుక్రవారమే భగీరథ్ కరీంనగర్ రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురిపై కేసు నమోదైంది.