జనసేన పార్టీలో తన పుష్కర కాలం నాటి సహనానికి స్వస్తి పలుకుతున్నానని, ఇకపై పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పార్టీని ఒక సైనిక పటాలంలా ముందుకు నడిపించేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు. రాజమండ్రిలో జరిగిన పార్లమెంటరీ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీలో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీనికి తొలి అడుగుగా, అంతర్గత కలహాలతో సతమతమవుతున్న ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రకాశం జిల్లా కమిటీలో తీవ్రమైన వర్గ విభేదాలు ఉన్నాయని, కేవలం 25 మంది సభ్యుల మధ్య ఏకంగా 54 గొడవలు ఉన్నాయని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్గత కలహాలతో ఒకరినొకరు పనిచేయనివ్వకుండా పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో ఇలాంటి క్రమశిక్షణారాహిత్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటివరకు పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఇచ్చానని, కానీ ఇకపై తాను అనుకున్న పద్ధతిలోనే పార్టీని ముందుకు నడిపిస్తానని తేల్చిచెప్పారు. “ఒకే మార్గంలో నడవండి, లేదంటే పక్కకు తప్పుకోండి (ఫాల్ ఇన్ లైన్ ఆర్ ఫాల్ అవుట్ ఆఫ్ లైన్)” అంటూ గట్టిగా హెచ్చరించారు. ఈ నిర్ణయం ద్వారా పార్టీలో ఏ స్థాయి నేతలైనా క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పవనే బలమైన సందేశాన్ని పవన్ పంపించారు. త్వరలోనే ప్రకాశం జిల్లాకు కొత్త కార్యవర్గాన్ని నియమించనున్నట్లు సమాచారం.

