TELANGANA

సరికొత్త రికార్డు..! ఎకరం ఏకంగా రూ. 237 కోట్లు.. హైదరాబాద్‌లో ఎక్కడంటే .?

హైదరాబాద్ మహా నగరంలో మరోమారు భూములు.. రికార్డు ధర పలికాయి. శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గంలో టీజీఐఐసీ భూముల వేలం నిర్వహించగా.. ఎకరం ఏకంగా రూ.237 కోట్లకు అమ్ముడుపోయింది. సర్వే నంబర్ 83/1 లోని 6 ఎకరాల 29 గుంటల భూమికి వేలం నిర్వహించగా ఈ రికార్డు ధర దక్కింది. 2025 డిసెంబర్ లో రాయదుర్గంలోని 7.67 ఎకరాలకు వేలం నిర్వహించగా.. రూ.177 కోట్లు ధర పలికింది. అప్పట్లో 7 ఎకరాలకు గానూ టీజీఐఐసీకి రూ.1357.59 కోట్ల ఆదాయం లభించింది. ఈసారి ఎకరం రూ.237 కోట్లు పలకడంతో అంతకుమించి ఆదాయం టీజీఐఐసీ ఖజానాలోకి వెళ్లనుంది.

 

వేలంలో ఈ భూమిని ‘గౌర వెంచర్స్’ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మల్టీ యూజ్ కేటగిరీ కింద దీనిని సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీని ప్రకారం.. రాయదుర్గంలోని ఈ ల్యాండ్ ను రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, హోటల్స్ ఇలా అవసరం కోసమైనా వినియోగించే వెసులుబాటు గౌర వెంచర్స్ కు లభించనుంది. మరోవైపు వేలం వేయబడ్డ ఈ ల్యాండ్.. మైండ్ స్పేస్ ఐటీ పార్క్, టి-హబ్, టీ-వర్క్స్, క్వాల్ కామ్ క్యాంపస్, మెట్రో స్టేషన్ కు అతి సమీపంలో ఉండటం వల్లే ఈ స్థాయి ధర లభించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

 

ఇదిలా ఉంటే 2025లో రాయదుర్గంలో మెుత్తం రెండు వేర్వేరు ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఇందులో 7.67 ఎకరాల స్థలానికి జరిగిన వేలంలో ఎకరాకు రూ. 177 కోట్ల రికార్డు ధర లభించింది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 1,357.59 కోట్ల ఆదాయం సమకూరింది. మరో 11 ఎకరాల ప్లాట్‌కు జరిగిన వేలంలో ఎకరాకు రూ. 141.5 కోట్ల చొప్పున మొత్తం రూ. 1,556.5 కోట్లు వచ్చాయి. ఈ రెండు వేలాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 2,914 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లయింది.

 

గతేడాది డిసెంబర్ లోనే కోకాపేటలో నిర్వహించిన భూముల వేలంలోనూ రికార్డు ధరలు నమోదు అయ్యాయి. నియోపోలిస్ లేఅవుట్‌లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం రూ.151.25 కోట్లు పలికింది. ప్లాట్ నెం. 15 (4.03 ఎకరాలు)లో ఎకరాకు రూ.151.25 కోట్లు బిడ్ రాగా.. ప్లాట్ నెం.16 (5.03 ఎకరాలు)లో ఎకరా ధర రూ.147.5 కోట్ల వద్ద ఆగింది. మెుత్తంగా 3 విడతల్లో ఆరు ప్లాట్లలోని 27 ఎకరాలకు రూ.3,708 కోట్ల ఆదాయం అప్పట్లో హెచ్ఎండీఏకు లభించింది.