National

దూసుకొస్తున్న ఎన్ నినో..! భారత్‌పై దాని ప్రభావం ఎంతో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై విపరీతమైన చర్చ నడుస్తోంది. అదే దానిపేరు గాడ్జిల్లా ఎల్‌ నినో. నార్మల్‌గా అయితే రెండేళ్ల నుంచి ఏడేళ్లకు ఒకసారి వచ్చే ఈ తరహా ఎల్‌‌నినో.. ఈసారి అసాధారణంగా బలపడే సంకేతాలు ఇస్తోంది. దీంతో శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

 

దూసుకొస్తున్న గాడ్జిల్లా ఎన్ నినో .. ఆల్రెడీ సంకేతాలు

 

ప్రపంచ వాతావరణ సంస్థ-WMO-యూరప్‌కు చెందిన వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన నివేదికలతో ప్రపంచవ్యాప్తంగా అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయి. ఎల్‌ నినో అనేది పసిఫిక్‌ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రతల్లో సంభవించే మార్పు అన్నమాట. పసిఫిక్‌లో వీచే ట్రేడ్‌ విండ్స్‌ని ఆసియా వైపు నెట్టేస్తాయి.

 

ఎల్‌ నినో సమయంలో ఆ గాలులు కాస్త బలహీనపడడంతో వేడి నీరు తూర్పు పసిఫిక్‌ వైపు మళ్లుతుంది. ఈ మార్పు ప్రపంచ వాతావరణ వ్యవస్థ ప్రభావితం చేయనుంది. మధ్య పసిఫిక్‌లోని శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా నినో 3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను పర్యవేక్షిస్తారు. ఈసారి సాధారణం కంటే సుమారు 0.9 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. దీంతో ఎల్ నినోను సూచించే 0.5 డిగ్రీల మార్కును దాటేసింది.

 

భారత్‌పై దాని ప్రభావం ఎంత? ఇక కష్టాలు తప్పవా?

 

యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్స్ అంచనా ప్రకారం.. డిసెంబర్ నాటికి నినో 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశముందని చెబుతోంది. అదే జరిగితే 1997-98, 2015-16 సూపర్‌ ఎల్‌ నినో రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉందని వాతావరణ వేత్తల అంచనా. అందుకే దీనికి గాడ్జిల్లా ఎల్‌ నినో అని పిలుస్తున్నారు.

 

గాడ్జిల్లా ఎల్‌ నినో కూడా ప్రపంచ వాతావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని భావించి ఆ పేరు పెట్టారు. 2024 ఏడాది ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది. ఎల్‌నినో సమయంలో పసిఫిక్‌ మహా సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వర్షాలను తీసుకొచ్చే గాలి ప్రవాహాలు తూర్పు వైపుకు మళ్లుతాయి.

 

ఫలితంగా భారత ఉపఖండానికి చేరాల్సిన తేమ అమాంతంగా తగ్గిపోతుంది. రుతుపవనాలు బలహీనపడటంతో సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదు అవుతాయి. 1971-2020 మధ్యకాలం సగటుతో పోలిస్తే ఈసారి కేవలం 90 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. ఈ సీజన్‌లో లోటు వర్షాలు నమోదయ్యే అవకాశం 60 శాతం వరకు ఉందని చెబుతోంది.

 

రుతుపవనాలు కేవలం వాతావరణం కాదు, దేశంలో వార్షిక వర్షపాతం సుమారు 70 శాతాన్ని అందిస్తుంది. దీని కారణంగా వర్షాలు తగ్గితే వ్యవసాయ రంగం దెబ్బ తింటుంది. 2015-16 వరకు సూపర్ ఎల్ నినో నమోదు అయ్యింది. ఆ సమయంలో దేశంలో సగటు వర్షపాతంలో 86 శాతం నమోదు అయ్యింది.

 

ఈ క్రమంలో చాలా రాష్ట్రాలు కరువు బారిన పడ్డాయి. వ్యవసాయం దిగుబడులు తగ్గడంతో ద్రవ్యోల్బణం అమాంతం పెరిగిన విషయం తెల్సిందే. గాడ్జిల్లా ఎల్‌ నినో ప్రభావం కేవలం భారత్‌కు మాత్రమే కాదు ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లలో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.