తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. డీఎంకే కూటమి నుంచి వైకో నేతృత్వంలోని ఎండీఎంకే తప్పుకున్న 24 గంటల వ్యవధిలోనే ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎండీఎంకేకు చెందిన 150 మందికి పైగా ముఖ్య నేతలు, జిల్లా కార్యదర్శులు, ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు ఆదివారం డీఎంకే గూటికి చేరారు.
చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. వీరిలో శివగంగైకి చెందిన పులవర్ ఎస్. సేవంతియప్పన్, తిరువళ్లూరుకు చెందిన టి.ఆర్.ఆర్.సెంగుట్టువన్, ప్రచార కార్యదర్శి తిరుపరంకుండ్రం అళగుసుందరం, విరుదునగర్కు చెందిన ఆర్.ఎం.ఎస్. శేఖర్ వంటి ఎండీఎంకే అగ్రనేతలు ఉన్నారు. వీరితో పాటు డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీకి చెందిన 40 మంది విద్యార్థి నేతలు కూడా డీఎంకేలో చేరడం గమనార్హం. ఈ ఆకస్మిక వలసలతో శివగంగై, తిరువళ్లూరు, విరుదునగర్, తిరుపూర్ వంటి కీలక జిల్లాల్లో డీఎంకే తన సంస్థాగత బలాన్ని మరింత పెంచుకుంది.
అంతకుముందు శనివారం జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో.. డీఎంకేతో ఉన్న తొమ్మిదేళ్ల బంధాన్ని తెంచుకుంటున్నట్లు ఎండీఎంకే ప్రకటించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా, అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీఎంకే తెరవెనుక రాజకీయ ఒప్పందాలు చేసుకుందని ఎండీఎంకే తీవ్ర ఆరోపణలు చేసింది. కూటమిలో తమకు తీవ్ర అవమానాలు జరిగాయని వైకో ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఒంటరిగానే నిర్ణయాలు తీసుకుంటామని, రాబోయే ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. అయితే ఎండీఎంకే చేసిన ఆరోపణలను డీఎంకే తీవ్రంగా ఖండించింది.

