TELANGANA

కవిత పార్టీ వివాదంపై కేటీఆర్ కౌంటర్..!

దిల్లీలో పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత కొత్త పార్టీ ‘టీఆర్ఎస్’ (తెలంగాణ రక్షణ సేన) పేరు వివాదంపై ఆయన స్పందించారు. ‘టీఆర్ఎస్ పేరు పెట్టడంపై కొందరు మా పార్టీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేసి ఉండొచ్చు. మా పార్టీ పేరును వాడుకోవాలని చూస్తే కార్యకర్తలు ఎందుకు ఊరుకుంటారు. బంధం కంటే పార్టీనే ముఖ్యం’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

 

మరోవైపు ఫార్మూలా రేస్ కేసుకు గురించి కూడా కేటీఆర్ చిట్ చాట్ లో స్పందించారు. జులైన 31న విచారణకు హాజరవుతున్నట్లు తెలిపారు. న్యాయస్థానంపై తనకు పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ గురించి మాట్లాడుతూ.. తెలంగాణలో ఆ పార్టీ ఛాన్సే లేదని అన్నారు. ఆ పార్టీలో నాయకులు ఎవరు ఉన్నారని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు. మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని.. కేటీఆర్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. 2027 ప్రారంభంలో పాదయాత్ర చేస్తానని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు.

అటు సీఎం రేవంత్ రెడ్డిపైనా కేటీఆర్ విమర్శలు చేశారు. కాలేశ్వరం విషయంలో ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాల వల్ల రైతుల ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. 31 నెలల పాలనలో 76 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చారని తెలంగాణ కొరకు సాధించింది ఏంటి? అంటూ నిలదీశారు. రాష్ట్రంలోని కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు.

 

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 30 శాతం డిమాండ్ చేస్తూ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మెట్రో కింద ఉన్న 280 ఎకరాల స్థలాలను రేవంత్ రియల్ ఎస్టేట్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. మరోవైపు బండి సంజయ్ తనకు ఎలాంటి విభేదాలు లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. కొడుకు పోక్సో కేసు విషయంలో.. ఆయన రాజీనామా చేసి ఉంటే బాగుండేదన్నారు. రాజకీయంగా ఆయనకు భవిష్యత్తు ఉండేదని అభిప్రాయపడ్డారు.

అటు ఏపీతో ఉన్న జల వివాదంపై కూడా కేటీఆర్ మాట్లాడారు. ‘ఏపీ ప్రభుత్వం పట్టుసీమ నుంచి నీళ్లు వాడుకుంటోంది. అక్కడి ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. రేవంత్ రెడ్డి మాత్రం ప్రజలతో చెలగాటమాడుతున్నారు. లక్ష కోట్ల కాలేశ్వరం అవినీతి జరిగిందంటున్నారు. మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆదాయం పెరిగింది. ఆస్తులు పెరిగాయి. రేవంత్ పాలనలో అప్పులు పెరిగాయి తప్ప ఆస్తులు పెరగలేదు’ అంటూ చెప్పుకొచ్చారు.