వైసీపీ తమ శ్రేణులను బలోపేతం చేసే దిశగా డిజిటల్ బాట పట్టింది. ఇందులో భాగంగా, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను గురువారం ప్రారంభించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ యాప్ను అధికారికంగా ఆవిష్కరించారు.
ఈ యాప్ను వైసీపీ కుటుంబం కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు పార్టీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించింది. కార్యకర్తలు ఈ యాప్ను వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతూ సంబంధిత లింక్ను కూడా పంచుకుంది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో ఇది అందుబాటులో ఉంటుందని, సులభంగా డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్తో కూడిన ప్రచార చిత్రాలను విడుదల చేసింది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలో, జగన్ పార్టీ నేతలను ఉద్దేశించి యాప్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాలో తమ కార్యకర్తలు పోస్ట్ చేసే కంటెంట్ను తొలగిస్తున్నారని, ఈ క్రమంలో పార్టీ కోసం ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ను సిద్ధం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ యాప్ ద్వారా కార్యకర్తలు తమ అభిప్రాయాలను నిరభ్యంతరంగా వ్యక్తం చేయవచ్చని, పార్టీతో నిత్యం అనుసంధానమై ఉండవచ్చని పేర్కొన్నారు.
ఈ యాప్ ద్వారా నాయకులు, కార్యకర్తలు నిరంతరం సమన్వయంతో ఉండే అవకాశం ఉంటుందని జగన్ తెలిపారు. పార్టీ నిర్వహించే విలేకరుల సమావేశాలు, పర్యటనలు, అధికారిక ప్రకటనలు వంటి సమాచారం అంతా ఈ యాప్ ద్వారా ప్రతి కార్యకర్తకు చేరువవుతుందని అన్నారు. త్వరలోనే ఈ యాప్లో డిజిటల్ డైరీ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.

