కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సగం పదవీకాలం పూర్తికాకముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన మోసకారి ప్రభుత్వంగా మారిందన్నారు. అందుకే సమాజంలోని ప్రతి వర్గం ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని విమర్శించారు.
హైదరాబాద్ నగరానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. యువజన సభ ఏర్పాట్లు, నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆడబిడ్డల నుంచి అన్నదాతల వరకు, విద్యార్థుల నుంచి నిరుద్యోగ యువత వరకు ఏ ఒక్కరికీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, అవినీతి, స్కామ్లు, అక్రమాలు, అరాచకాలనే పాలనగా మార్చుకున్నారని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు, అనుసరిస్తున్న విధానాలు ప్రజా కంటంకంగా మారాయని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత సర్వేల్లోనే వ్యక్తమైందన్నారు. రైతులు సాగునీటి కోసం అడుగుతుంటే వారికి భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ‘రక్తం పారిస్తా అన్నట్లుగా మాట్లాడటం అత్యంత దురదృష్టకరమని అన్నారు. యువత, నిరుద్యోగుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ‘యూత్ డిక్లరేషన్’ పేరిట భారీ మోసం చేసిందని ఆరోపించారు.
వరంగల్ రైతు సభ అనంతరం.. ఈ నెల 18న యువత, విద్యార్థులతో భారీ యువజన సదస్సు నిర్వహించి కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజల ముందుంచనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. యువజన సభకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని అలాంటి ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్తో పాటు పరిసర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా భారీ సంఖ్యలో యువత స్వచ్ఛందంగా సభకు తరలివస్తారని పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు.

